స్వర్గంలోనే ప్రేమ పుట్టే 'దేవుడు చేసిన మనుషులు'
పూరీ జగన్నాధ్, రవితేజ కాంబినేషన్ లో రూపొంది విడుదలకు సిద్దమవుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ తెలుపుతూ...పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయట. మరి ప్రేమ పుట్టుక కూడా అక్కడే జరుగుతుందా? ఎవరు ఎవరిని ప్రేమించాలో దేవుడే నిర్ణయిస్తాడా? ప్రేమ అనే కాదు... ఈ సృష్టిలోని సమస్త విషయాలకూ బీజం భగవంతుడే వేస్తాడు. దేవుడికి అదో ఆట. ఈసారి ఆయనకు మరో ఇద్దరు దొరికారు... ఏదో మాయ చేసి వారిద్దరి మధ్య ప్రేమ సృష్టించాడు. మరి ఆ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలి అన్నారు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ - ''అన్ని తరగతులవారినీ అలరించే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకుల ఊహలకు అందని స్థాయిలో సినిమా ఉంటుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. కుంచె రఘు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.తమాషాగా సాగే కథ ఇది. పూరి శైలిలోనే వినోదాత్మకంగా ఉంటుంది. కథలో మలుపులు ఆసక్తిని కలిగిస్తాయి'' అని తెలిపారు.
'దేవుడు చేసిన మనుషులు' ఆడియో పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా ఉందని, తన జీవితానికి ఈ సినిమా ఓ మేలి మలుపు అని కుంచె రఘు చెప్పారు. దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్న వేసుకోవడం, సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో, ఆకలి పోగొట్టిన మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది. ఆ విషయమే మా కథలో చెబుతున్నాం అని పూరీ జగన్నాధ్ అన్నారు.
'దేవుడు చేసిన మనుషులు'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తారు. సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, సంగీతం: రఘు కుంచె, ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్.


Click it and Unblock the Notifications











