AP Elections అల్లు అర్జున్పై కేసు నమోదు.. A1 గా ఐకాన్ స్టార్.. నంద్యాలలో ఏం జరిగిందంటే?
నంద్యాలలో తన స్నేహితుడిని గెలిపించడానికి ర్యాలీ నిర్వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ముందస్తు అనుమతి లేకుండా వేలాది మందితో కలిసి ప్రదర్శన నిర్వహించడంపై అధికారులు కన్నెర్ర చేశారు. ఎన్నికల కోడ్ పట్టించుకోకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా ర్యాలీ, ఎన్నికల ప్రచారం చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ కేసు వివరాల్లోకి వెళితే..
నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శనివారం ఉదయం తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి పర్యటించారు. తనకు అత్యంత ఆప్తుడు, నంద్యాలలో అసెంబ్లీ స్థానానికి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన గెలుపుకు సహకరించడానికి అల్లు అర్జున్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన వేలాది మందితో తన వాహనంతో ర్యాలీ నిర్వహించారు.

అయితే ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ర్యాలీ, ఎన్నికల ప్రచారం చేయడంపై అధికారులు తీవ్రంగా స్పందించారు. శిల్పా రవిరెడ్డి, అల్లు అర్జున్పై కేసులు నమోదు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నంద్యాల లో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున దానిని బేఖాతరు చేసి అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అనుమతి లేకుండా ప్రచారం చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ పి రామచంద్రరావు ఫిర్యాదు మేరకు నంద్యాల టూ టౌన్ పిఎస్లో కేసు నమోదు చేశారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో సినీ నటుడు, త్వరలో విడుదల కాబోతున్న పుష్ప 2 హీరో అల్లు అర్జున్, నంద్యాలలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. వారికి చట్ట ప్రకారం నోటీసులు అందజేశారు.
ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడంపై మెగా,పవర్ స్టార్, జనసేన, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అల్లు అర్జున్పై భగ్గుమంటున్నారు. జనసేనకు మద్దతు తెలిపి వైసీపీ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో పుష్ప 2 హీరోను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











