విలన్గా కీరవాణిని రాజమౌళి...
కీరవాణి... మొదట తెరపై కనిపించింది 'జీవితమే ఒక సినిమా' అనే సినిమాలో. అందులో ఓ చిన్న వేషంలో కనిపిస్తారు. జగపతిబాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన 'అల్లుడుగారు వచ్చారు'లో ఓ సంగీత విద్వాంసునిగా నటించారు. 'రక్షణ'లో 'ఘల్లుమంది బాసూ... గలాసూ' పాటలో నాగార్జున, రోజాతో పాటు నిర్మాత వెంకట్ అక్కినేని, కెమెరామేన్ తేజ, నృత్యదర్శకుడు ప్రభుదేవాతో పాటు కీరవాణి కూడా కనిపిస్తారు.
అలాగే 'సమర్పణ' సినిమాలో ముష్టివాడు పాత్రలో ఆయన నటించారు. హీరో అర్జున్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రతాప్' అనే తమిళ సినిమాలో ఓ అరనిమిషం పాత్ర చేశారు. 'మగధీర'లో 'శుభం కార్డు' తర్వాత వచ్చే పాటలో యూనిట్ సభ్యులతో పాటు కీరవాణి కూడా కనిపిస్తారు. సరిగ్గా ఆ పాట చిత్రీకరణ సమయానికి ఆయన అమెరికాలో ఉండడంతో, అక్కడ నుంచే వీడియో షూట్ చేసి పంపించారు.
ఇక 'శ్రీరామదాసు'లో రాళ్లపల్లి వేసిన పడవవాడి వేషం కీరవాణినే వేయమన్నారు. కానీ తనకు నీళ్లంటే భయమని చేయననేశారు కీరవాణి. 'సొంతవూరు'లో ఎల్బీ శ్రీరామ్ చేసిన పాత్రకు మొదట కీరవాణినే అడిగారు. కానీ కుదరలేదు. ఇక కీరవాణి సతీమణి వల్లీకి పోలీసు వృత్తి అంటే ఇష్టం. అందుకేనేమో ఓసారి కీరవాణితో పోలీస్ డ్రెస్ వేయించి తన ముచ్చట తీర్చుకున్నారు. అలా పోలీస్ డ్రెస్తోనే కె.రాఘవేంద్రరావు ఆఫీసుకి వెళ్లారు కీరవాణి. రాఘవేంద్రరావు ఆశ్చర్యపోయి ''ఈ డ్రెస్ నీకు బాగుంది. ఇప్పుడు తీస్తున్న 'ఘరానా బుల్లోడు' సినిమాలో ఒక పోలీసు పాత్ర ఉంది. నువ్వే చెయ్యాలి'' అన్నారు. తర్వాత రాఘవేంద్రరావు మరిచిపోలేదు. రాజమండ్రిలో షూటింగ్ ఉంది. రమ్మని కబురుపెట్టారు. కానీ కుదరక కీరవాణి వెళ్లలేకపోయారు. అలా ఆ పాత్ర మిస్సయ్యింది.


Click it and Unblock the Notifications












