2 అనుకుంటే 30 కోట్లయింది: ‘ఈగ’ నిర్మాత
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మోస్ట్ వెయిటెడ్ మూవీ 'ఈగ' చిత్రం జులై 6న (రేపు) విడుదలయ్యేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈచిత్రాన్ని రూ. 2 కోట్ల బడ్జెట్తో ముందస్తు ప్రణాళికలు వేసుకున్నారట జక్కన్న. కానీ సినిమా పూర్తయ్యే సరికి బడ్జెట్ కాస్తా రూ. 2 నుంచి 30 కోట్లకు చేరుకుంది.
ఓ ఇంటర్వ్యూలో 'ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ....రాజమౌళి తన ఈగ చిత్రానికి నన్ను నిర్మాతగా అడిగారు, మర్యాద రామన్న చిత్రం షూటింగ్ సమయంలో ఈచిత్రం కాన్సెప్టు, స్టోరీలైన్ గురించి చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి రూ. 2 కోట్లతో ఈ చిత్రాన్ని తీద్దామని చెప్పారు. ఎక్సపర్మెంటల్ చిత్రం అయినప్పటికీ రాజమౌళిపై నమ్మకంతో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాను అని చెప్పారు.
మర్యాద రామన్న చిత్రం హిట్ అయితేనే ఈగ ప్రాజెక్టు చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. ఆ సినిమా హిట్ కావడంతో 'ఈగ' చిత్రాన్ని అనౌన్స్ చేశాం. అప్పటికి లెక్కలు వేసుకుంటే బడ్జెట్ రూ. 7.5 కోట్లుకు చేరుకుంది. అది అలా పెరుగుతూ పెరుగుతూ రూ. 30 కోట్లకు చేరుకుందని సాయి చెప్పారు.
వాస్తవానికి అంత బడ్జెట్ భరించే శక్తి సాయి కొర్రపాటికి లేదు. దీంతో నిర్మాత డి. సురేష్ బాబును ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అడిగారు. ఆయన వద్ద రూపాయిన్నర వడ్డీకి డబ్బు అప్పు తీసుకున్నాడు. సాయి కొర్రపాటి స్నేహితులు కూడా సాయం చేయడంతో సినిమాను పూర్తి చేయగలిగాడు నిర్మాత. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైతేనేం ఈగ చిత్రం సాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ కలిపి విడుదలకు ముందే రూ. 20 కోట్లు వసూలు చేసింది. స్టార్ హీరోలు ఎవరూ లేక పోయినా...రాజమౌళి బ్రాండ్ నేమ్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. మరి బాక్సాఫీసు వద్ద ఈగ సత్తా ఏమిటో రేపు తేలనుంది.


Click it and Unblock the Notifications











