'బాహుబలి-2' : సెట్స్ కోసం రాజమౌళి స్థల పరిశీలన (ఫొటోలు)
హైదరాబాద్: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా 'బాహుబలి-2' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
'బాహుబలి-2' కొత్త సెట్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో స్థల పరిశీలన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్, మకుట వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పీట్ డ్రేపర్లతో కలిసి సెట్స్కోసం తగిన స్థలాన్ని వెదుకుతున్నట్లు పేర్కొన్నారు. స్థల పరిశీలన చేస్తుండగా తీసిన ఓ ఫొటోను ఆయన అభిమానులతో పంచుకున్నారు.
Discussing about new sets for Baahubali: The Conclusion with our production designer Sabu Cyril garu & Makuta VFX supervisor Pete Draper!
Posted by SS Rajamouli on 12 October 2015
మంగళవారం రామోజీ ఫిలింసిటీలో కొత్త సెట్స్ నిర్మాణం గురించి ప్రొడక్షన్ డిజైనర్ సాబుసిరిల్, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పీట్ డ్రాపర్తో సమాలోచనలు జరిపారు. అక్కడ సెట్స్ రూపుదిద్దుకోవడమే ఆలస్యం. వెంటనే చిత్రీకరణ మొదలుపెడతారు.
వచ్చే నెల నుంచి చిత్రీకరణ పనులు మొదలవ్వొచ్చని తెలుస్తోంది. జులై 10న విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' బాక్సాఫీసు దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'బాహుబలి: ది కన్క్లూజన్' తెరకెక్కబోతోంది.
భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.
రాజమౌళి తీసిన 'బాహుబలి'ని చూసిన వాళ్లంతా ఒక అద్భుతమైన సినిమాని చూసిన అనుభూతితో పాటు... పదే పదే గుర్తుకొచ్చే ఓ ప్రశ్నను కూడా ఇంటికి తీసుకెళ్లాల్సొచ్చింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నదే ఆ ప్రశ్న. దానికి జవాబు ఎప్పుడెప్పుడు తెలుసుకొందామా అన్న కుతూహలంతో ఉన్నారంతా.
అందుకే జక్కన్న 'బాహుబలి: ది కన్క్లూజన్' కోసం ఎప్పుడు రంగంలోకి దిగుతాడా అని ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. 'బాహుబలి: ది కన్క్లూజన్'కి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. రాజమౌళి తన బృందంతో కలిసి రంగంలోకి దిగాడు.

మరో ప్రక్క బాహుబలి ఇతర దేశాల్లోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. చైనాలో 'బాహుబలి'ని 5000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు చిత్రాన్ని ఎడిట్ చేశారు. పలు చలన చిత్రోత్సవాలకీ పంపుతున్నారు. చైనాలో ఈ చిత్రం నవంబరు నుంచి సందడి చేయబోతోంది. అక్కడ 'పీకే' చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్స్ ఫిలిమ్స్ సంస్థనే 'బాహుబలి'ని విడుదల చేస్తుండడం విశేషం.
'పీకే'కి చైనాలో మంచి ఆదరణ లభించింది. అదే తరహాలో 'బాహుబలి' కూడా చైనా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.


Click it and Unblock the Notifications











