ఎక్కడ విన్నా రాజమౌళి ట్రాఫిక్ పోలీస్ పాత్రే
రాజమౌళి తనలోని సామాజిక స్పృహతో చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమం ఇప్పుడు సిని వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి తన భార్యతో కలసి కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. స్వచ్ఛంద సంస్థ నంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరంలోని జూబిలీ హిల్స్ చెక్పోస్టు వద్ద రాత్రి 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటలవరకు ట్రాఫిక్ నియంత్రణా విధులను చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులతో కలసి న్యూఇయర్ కేక్ను కట్ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా చెక్పోస్టు వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. వాహనదారులలో అవగాహన కలిగించేందుకు తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాజమౌళి మీడియాకు చెప్పారు.
అంతేగాక ఆయన భార్య రమా రాజమౌళి అక్కడే ఉండి ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు ''నో డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్'' అంటూ కరపత్రాలు సైతం పంచిపెట్టారు. నాందీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ చొరవతో రాజమౌళి దంపతులు ముందుకువచ్చి ఈ సామాజిక సేవలో పాల్గొన్నారు. చెక్ పోస్ట్ దగ్గరే ఉన్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలసి కేక్ కోసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. నూతన సంవత్సరం తొలి రోజు కావడంతో జుబ్లీ హిల్స్ చెక్పోస్ట్ ప్రాంతమంతా వాహనాల రాకపోకలతో తీవ్ర రద్దీమయం అయ్యింది. కొన్ని గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.''ప్రయాణంలో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనల్ని అనుసరించడం చాలా ముఖ్యమైన విషయం. మద్యం సేవించి బండ్లు నడపడం వల్ల కలిగే అనర్థాలపై వాహన చోదకుల్లో అవగాహన కల్పించేందుకే మేము ఈ ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమంలో పాల్గొన్నాం'' అని రాజమౌళి అన్నారు.


Click it and Unblock the Notifications











