రజనీకాంత్ ఎఫెక్ట్ : కమల్ హాసన్ సినిమా వెనక్కి
చెన్నై : కమల్హాసన్ కొత్త చిత్రం 'విశ్వరూపం-2' మరోసారి వాయిదాపడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయొచ్చని కమల్హాసన్ సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దానికి కారణం రజనీకాంత్ చిత్రం విక్రమ్ సింహా రిలీజ్ డేట్ ఇవ్వటమే అంటున్నారు. రెండు చిత్రాలకు దాదాపు ఒకేసారి విడుదల అయితే థియోటర్స్ సమస్య వస్తుందని భావించి ఈ నిర్ణయిం తీసుకున్నారంటున్నారు.
గత ఏడాది 'విశ్వరూపం'తో ఘన విజయాన్ని అందుకున్నారు కమల్. వివాదాలే కాదు... చక్కని విజయంతోనూ ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. దీనికి సీక్వెల్గా 'విశ్వరూపం-2'ను తన దర్శకత్వంలోనే మొదలుపెట్టారు కమల్. తొలుత దీన్ని గత ఏడాది డిసెంబరులో విడుదల చేస్తామని ప్రకటించినా.. ఫిబ్రవరికి వాయిదా వేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. నిర్మాణాంతర పనులు పూర్తి కాకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
దీనికి దాదాపు మరో నెల పట్టే అవకాశముందని, ఏప్రిల్లో విడుదల చేయాలంటే 'కోచ్చడయాన్' (విక్రమ్ సింహా) రాక ఖరారు కావటంతో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశముందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇందులో భాగంగా మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.
ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.
కమల్ చెన్నైలో ఇటీవల మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.
విశ్వరూపం చిత్రానికి సీక్వెల్గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications












