నాకేమీ కాలేదు.. ఆందోళన చెందొద్దు: అభిమానులకు రజినీ సందేశం
'మ్యాన్ వర్సెస్ వైల్డ్' అనే టీవీ షో కోసం బ్రిటన్ దేశానికి చెందిన సాహసవీరుడు బేర్ గ్రిల్స్తో కలిసి మన సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ అడ్వెంచర్ షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కర్ణాటక రాష్ట్రంలోని బందీపూర్ అభయారణ్యంలో జరుగుతున్న ఈ షూటింగ్లో రజినీ గాయపడ్డారు. నిన్న (జనవరి 29) జరిగిన ఈ సంఘటన తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందారు.
అయితే గాయం కారణంగా కర్ణాటక నుంచి చెన్నై తిరిగి వెళ్లిన సూపర్ స్టార్.. తన ప్రమాదం విషయమై స్పందించారు. ''షూటింగ్ సమయంలో కొన్ని ముళ్లు గుచ్చుకున్నాయి. కాళ్ల కింద చర్మం గీసుకుపోయింది. అంతకుమించి నాకేమీ కాలేదు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు'' అని మీడియాకు చెప్పారు రజినీకాంత్. ఆయనిచ్చిన ఈ స్టేట్మెంట్ తో ప్రేక్షకలోకం ఊపిరిపీల్చుకుంది.

డిస్కవరీ ఛానెల్లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే 'మేన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో బేర్ డ్రిల్స్తో పాటు ఓ సెలబ్రిటీ అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ సాహసాలు చేస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అందులో భాగంగా ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. అందుకే ఈ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. గతేడాది ఇదే షోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'దర్బార్' సినిమాతో సంక్రాంతి సందడి చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రజినీకాంత్ సరసన ఖుష్బూ, మీనా నటిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











