రజనీ, మహేశ్, బన్నీ, రాంచరణ్ కొత్త కష్టాలు.. టాలీవుడ్ను వెంటాడుతున్న సరికొత్త భయం
Recommended Video

డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల వివాదం టాలీవుడ్ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నది. ఒకవేళ ఈ వివాదం తీవ్ర రూపం దాల్చితే టాలీవుడ్ పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనిపిసున్నది. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల (డీఎస్పీ) అధిపత్యాన్ని నిరసిస్తూ చలన చిత్ర వాణిజ్య మండలి మార్చి 1 నుంచి బంద్ పిలుపునివ్వాలని చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకొన్నది. భవిష్యత్లో ఈ వివాదంపై పెద్ద గొడవే జరిగే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత డీ సురేష్బాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

డిజిటల్ టెక్నాలజీ పట్టు
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సినిమా ప్రదర్శనపై పూర్తిగా డిజిటల్ టెక్నాలజీ పట్టు సాధించింది. రిలీజ్ అయ్యే సినిమాలను డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు థియేటర్లకి చేరవేస్తుంటారు. ఈ విధమైన సేవలందించే వాటిలో యూఎఫ్వో, క్యూబ్, పీఎక్స్బీ లాంటి సంస్థలు ఉన్నాయి. సినిమా ప్రదర్శన కోసం అందుకోసం వారానికి చొప్పున అద్దె తీసుకొంటారు. అయితే ఇతర రాష్ట్రాల్లో వారానికి రూ.2500 అద్దె తీసుకొంటే, మన దగ్గర మాత్రం రూ.10,800 తీసుకొంటున్నారనే ఆరోపణలను నిర్మాతలు చేస్తున్నారు.

నిర్మాతలకు తీవ్ర నష్టం
మల్లీప్లెక్స్ థియేటర్లలో అయితే రూ.13 వేలు వసూలు చేస్తున్నారు. ఒక్క షో వేసినా ఏడు రోజులకి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో నిర్మాతలు నష్టపోతున్నారనే వాదన వినిపిస్తున్నది.
ఈ వివాదంపై చర్చించడానికి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను పిలిచినా వారు చర్చకు రాకపోవడంతో ఈ సమస్య మరింత ముదిరింది. సదరు సంస్థల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చిత్ర పరిశ్రమ బంద్ నిర్ణయం తీసుకొంది.

చిత్ర పరిశ్రమ బంద్
డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల వివాదం నెలకొన్న నేపథ్యంలో సినిమా చిత్రీకరణలను, రిలీజ్లను కూడా నిలిపివేయాలని నిర్మాతల్ని కోరుతూ నిర్మాతల మండలికి లేఖ రాసింది. దాంతో చిత్రసీమలో కలకలం మొదలైంది. వివాదం పరిష్కారం కాకపోతే నిజంగానే పూర్తయిన సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అగ్రనటుల సినిమాలకు షాక్
రానున్న వేసవి సీజన్లో భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. రజనీకాంత్ నటించిన రోబో, మహేశ్బాబు నటించిన భరత్ అను నేను, అల్లు అర్జున్ చిత్రం నా పేరు సూర్య నా ఊరు ఇండియా లాంటి చిత్రాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. పోటాపోటీగా అగ్ర కథానాయకుల చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో బంద్ పిలుపు నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో వివాదం వేసవి సినిమాల విడుదలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో అని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

సినీ వర్గాల ఆందోళన
రాష్ట్రంలో చిత్రాల ప్రదర్శన థియేటర్ల యజమానుల పర్యవేక్షణలో కాకుండా, థర్డ్పార్టీ చేతుల్లోకి వెళ్లడం వల్లే ఇదంతా జరుగుతోంది అని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. థియేటర్ల యజమానులతో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు కుదుర్చుకొన్న ఒప్పందంవల్లే ప్రదర్శన విషయంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల మాటే చెల్లుబాట అవుతున్నది అని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

ఎందుకు వాయిదా వేయాలి
సిల్వర్స్కీన్పై సినిమా పడిన వద్ద నుంచి మూత్రశాలల నిర్వహణ, ఇతరత్రా సదుపాయాలన్నీ థియేటర్ యజమానే చూసుకోవాలి. కానీ ప్రదర్శన మాత్రం థర్డ్ పార్టీ చెప్పు చేతల్లోకి వెళ్లింది. ఆ పనులు నిర్వహించినందుకు నిర్మాత డబ్బు కట్టాలా? ఇలాంటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేకాని కోట్లాది డబ్బు పెట్టి నిర్మాతలు సినిమాలను తీసి విడుదలను ఎలా వాయిదా వేస్తారు అని నిర్మాత సురేష్ బాబు నిలదీస్తున్నారు.


Click it and Unblock the Notifications











