సంక్రాంతికి రేసు నుంచి తప్పుకున్న సూపర్ స్టార్
హైదరాబాద్: రకరకాల కారణాలతో ఒక్కో సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటోంది. రజనీకాంత్ నటించిన యానిమేషన్ చిత్రం 'విక్రమసింహ' (తమిళంలో కోచ్చడయాన్) సంక్రాంతికి వచ్చే అవకాశాలు లేవని చెన్నై సమాచారం. ఈ సినిమాకి రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. దీపికా పదుకొణె హీరోయిన్. యానిమేషన్, ఇతర సాంకేతికపరమైన కార్యక్రమాలకు మరింత సమయంపట్టే అవకాశం ఉందట. ఏప్రిల్లో విడుదల కావచ్చునని తెలుస్తోంది. దాంతో రామ్ చరణ్ నాయక్ కి పోటీ అనేది ఉండదు.
'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే లండన్లో విజువల్ ఎఫెక్ట్స వర్క్ పూర్తి చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని లక్ష్మి గణపతి ఫిలింస్ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. తమిళ్, హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శోభన, శరత్కుమార్, జాకీ ష్రాప్, నాజర్ ..ఇలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ విభిన్న అవతారంలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులు సహా ప్రేక్షకుల్లో వైబ్రేషన్ క్రియేట్ చేశాయి.
రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని అభిమానులకు మాటిచ్చారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కొచ్చాడయాన్ చిత్రం విడుదల లేటవుతోంది.


Click it and Unblock the Notifications











