RRR కు నిర్మాతలం, దర్శకత్వం మేమే అని చెప్పుకోకండి.. పార్లమెంట్లో బీజేపీపై కాంగ్రెస్ సెటైర్లు
ప్రపంచస్థాయిలో RRR చిత్రం తెలుగువాడి సత్తా చాటింది. RRR చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో పురస్కారం సాధించింది. ఈ నేపథ్యంలో సినీ అభిమానులు సంతోషంలో ఉంటే.. రాజకీయ రంగంలో బీజేపీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అందుకు కారణం RRR సినిమా రిలీజ్కు ముందు బీజేపీ నేతలు అడ్డుకొంటామని హెచ్చరించిన సంఘటనలు ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంలో బీజేపీ ఎందుకు టార్గెట్ అయింది? పార్లమెంట్లో బీజేపీపై కాంగ్రెస్ ఎందుకు సెటైర్లు వేసిందనే విషయంలోకి వెళితే..

బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
RRR సినిమా రిలీజ్కు ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొమురం భీమ్ పాత్రను వక్రీకరిస్తే.. సినిమాను నిలిపిస్తాం. సినిమా థియేటర్లను కాలబెడుతాం. RRR సినిమాను అడ్డుకొంటామని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. దాంతో RRR సినిమాను బీజేపీ అడ్డుకొంటుందా? అనే అనుమానం తలెత్తింది. అలాంటి వివాదాన్ని దాటుకొని RRR సినిమా రిలీజైంది.

RRR సినిమాకు బదులు ఛెల్లో
ఇక RRR సినిమాను భారత్ తరఫున ఆస్కార్ నామినేషన్ పంపే విషయంలో కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపించిందనే వివాదం మీడియాలో కనిపించింది. అయితే భారత్ తరఫున RRR సినిమాను పంపించకుండా.. గుజరాత్ భాషలో నిర్మించిన చిన్న చిత్రం ఛెల్లో ను భారత్ తరఫున ఆస్కార్ నామినేషన్కు పంపించారు. దాంతో RRR సినిమాకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

రాజమౌళి స్వయం కృషితో ఆస్కార్
భారత్ తరఫున ఛెల్లో సినిమా నామినేట్ కావడంతో RRR సినిమాను దర్శకుడు రాజమౌళి మరో మార్గంలో ఆస్కార్ నామినేట్ చేయడానికి శ్రమించారు. ఛెల్లో సినిమా నామినేట్ కాకపోగా.. రాజమౌళి ప్రయత్నం కారణంగా RRR సినిమాలోని నాటు నాటు పాటను నామినేట్ చేయడమే కాకుండా అవార్డును తెచ్చిపెట్టేలా ప్రమోషన్ చేశారు.

బీజేపీపై శ్రీనివాస్ యాదవ్ ఫైర్
అయితే RRR సినిమా ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత బీజేపీ నేతలు స్పందిస్తున్న తీరుపై బీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో RRR సినిమాను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఈ సినిమాను విడుదల విషయంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను పరిష్కరించాం. రాజమౌళితో చర్చించి జరిపి RRR సినిమాను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రిలీజ్ చేశాం. కానీ అవార్డు తెచ్చుకొన్న తర్వాత బీజేపీ అంతా తామే చేశామని చెప్పుకోవడం సరికాదు అని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఆర్ఆర్ఆర్పై రాజ్యసభలో చర్చ
భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంపై పార్లమెంట్లోని పెద్దల సభ రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లీఖార్జున్ ఖార్గే, బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి తదితరులు చర్చలో పాల్గొన్నారు. అయితే RRR కథా రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్రప్రసాద్ లేకపోవడం గమనార్హం.
బీజేపీపై కాంగ్రెస్ సెటైర్లు
పార్లమెంట్లోని రాజ్యసభలో జరిగిన చర్చలో RRR సినిమా యూనిట్ను ప్రశంసలతో ముంచెత్తారు. అాలాగే ఆస్కార్ అవార్డు సాధించిన ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ది ఎలిఫెంట్ విష్పరర్ సినిమాను నిర్మించిన ఇద్దరు మహిళలకు ధన్యవాదాలు అని చెప్పారు. RRR సినిమా భారతీయ ఖ్యాతిని పెంపొందించింది. ఆ ఖ్యాతిని మీ ఖాతాలో వేసుకోకండి. RRR సినిమాను మేమే నిర్మించామని, మేమే దర్శకత్వం వహించామని చెప్పుకోకండి అంటే మల్లిఖార్జున్ ఖార్గే సెటైర్లు వేశారు.


Click it and Unblock the Notifications











