బాబాయ్కి నచ్చని పని చేయను, ఫోన్ చేస్తే చాలు.. ఎన్టీఆర్తో సినిమా అనగానే.. రాంచరణ్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస ఇంటర్వ్యూలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. వినయ విధేయ రామ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు నిలవడంతో పోటీ ఎలా సాగుతుంది, ఈ చిత్రం ఏస్థాయిలో విజయం సాధిస్తుంది అని సినీ విశ్లేషకులు అంచనాలు మొదలు పెడుతున్నారు. మాస్ యాక్షన్ చిత్రంగా రాబోతున్న వినయ విదేయ రామ చిత్రం కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కుటుంబం నుంచి మద్దత్తు
జనసేన పార్టీకి మీ సపోర్ట్ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు చరణ్ సమాధానం ఇచ్చాడు. ఈ ప్రశ్నకు గతంలోనే సమాధానం ఇచ్చా. బాబాయ్ కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధం. ఎందుకంటే ఆయన నా బాబాయ్. కుటుంబం నుంచి మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని రాంచరణ్ తెలిపాడు.

ఎన్నికల్లో ప్రచారం
జనసేన పార్టీ కోసం త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రచారం చేసే విషయం గురించి మాట్లాడుతూ.. బాబాయ్ కి నచ్చని పని ఎప్పుడూ చేయను. ఆయనకు అనిపించి ఒక ఫోన్ చేస్తే చాలు.. పరిగెత్తుకుని వెళతా అని రాంచరణ్ తెలిపాడు. బాబాయ్ ఎక్కువగా అందుబాటులో ఉండరు. కానీ ఏదైనా కష్టం వస్తే చాలా మందికి మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి ఆయనే అని రాంచరణ్ తెలిపాడు. సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా భయం లేకుండా ఒకేలా ఉండడం బాబాయ్ లో నచ్చే విషయం అని రాంచరణ్ తెలిపాడు.

మా ఇంట్లో డిన్నర్
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో స్నేహం గురించి మాట్లాడుతూ.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. తొలిసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఇంటికి పిలిచి డిన్నర్ ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. వినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్కు కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్తో సినిమా అనగానే
ట్రిపుల్ ఆర్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఆ సినిమాకు సంబంధించి అంతకు మించి మాట్లాడకూడదు. ఎన్టీఆర్ తో కలసి సినిమా అనగానే నాకు ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు. మేమిద్దరం ఆల్రెడీ స్నేహితులం. ట్రిపుల్ ఆర్ సెట్స్ లో కూడా అలాగే ఉంటాం అని చరణ్ తెలిపాడు.

అంత తీరిక లేదు
ట్రిపుల్ ఆర్ చేస్తూ మరో సినిమా చేస్తారా అనే ప్రశ్నకు చరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అసలు నాకు అంతా తీరిక ఉందా.. ట్రిపుల్ ఆర్ లో నటించాలి మరోవైపు సైరా నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన పనులు చూసుకోవాలి. చాలా ఒత్తిడిలో ఉన్నా అని చరణ్ తెలిపాడు. సైరా చిత్ర మరో రెండు నెలల్లో ఫినిష్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ఈ ఏడాది మధ్యలో సైరా చిత్రం విడుదలవుతుందని చరణ్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











