ఈ సారి ‘ఎర్త్ అవర్’ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్
హైదరాబాద్: 2014 సంవత్సరం 'ఎర్త్ అవర్' బ్రాండ్ అంబాసిడర్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు చెర్రీ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను పోస్టు చేసాడు. ఈ నెల 29న రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటలకు వరకు ఎర్త్ అవర్ పాటించనున్నారు. ఎర్త్ అవర్లో పాల్గొనాలనుకునే వారు గంట పాటు విద్యుత్ వాడకం నిలిపి వేయాలి.
మనం రోజూ ఎన్నో గంటలు మన వృత్తి కోసం మన కుటుంబం కోసం వెచ్చిస్తాం. మనకు ప్రధాన జీవనాధారమైన భూమి గురించి సంవత్సరానికి ఒక గంట ఇవ్వలేమా? ఇదే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా మార్చి నెల చివరి శనివారం నాడు ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు. భూమి మీద వాతావరణం మెరుగుపడేందుకు, సహజమైన పరిస్ధితులు నెలకొనేందుకు ప్రజల్లో జాగృతిని తెచ్చే ఆలోచనే ఈ ఎర్త్ అవర్.
గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం సాగుతోందని, ప్రపంచ వ్యాప్తంగా పట్టణాలు, నగరాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. భూమాత అందిస్తున్న వనరులు అధిక వినియోగమవుతున్నాయని, వాటిని తగ్గించుకుని ప్రకృతి సమతౌల్యానికి పాల్పడాలన్న సందేశంతో 'ఈ ఎర్త్ అవర్' కార్యక్రమం ప్రారంభమైంది.
కాలుష్యం పెరిగిపోవడం, ఆడవులు అంతరించిపోవడం, పర్యావరణ సమతుల్యత నశించడం వంటి కారణాల వల్ల భూమండలం వేడెక్కిపోతోంది. కాలుష్యం వల్ల ఓజోన్ పొర పలుచబడిపోతోంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక గంట విద్యుత్ నిలిపి వేసి ఎర్త్ అవర్ పాటించడం ద్వారా పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేసిన వారమవుతామనేది ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.


Click it and Unblock the Notifications












