‘మా’లో గొడవలు.. అది మంచి పరిణామం.. రామ్ చరణ్ కామెంట్స్
Recommended Video
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అభాసుపాలైన సంగతి తెలిసిందే. రాజశేఖర్ మధ్యలో వచ్చి మాలో విబేధాలను బహిరంగంగా చర్చించడం, అది కూడా మోహన్ బాబు, చిరంజీవి, కృష్ణం రాజు లాంటి వారి ముందు సభా మర్యాదను ఉల్లంఘించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ వివాదం చివరకు రాజశేఖర్.. రాజీనామా వరకు వెళ్లి ఆగింది.

మాలో అంతా సీనియర్లే..
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో అంతా సీనియర్ హీరోలే ఉన్నారు. మన యంగ్ హీరోలు ఇలాంటి వ్యవహారాల్లో ఎక్కడా జోక్యం చేసుకున్నట్లు ఆనవాళ్లు కూడా కనిపించవు. అయితే నడిఘర్ సంఘం వ్యవహారాలు మాత్రం అలా కావు. అక్కడ యంగ్ హీరోల హవా కొనసాగుతూ ఉంటుంది. విశాల్, కార్తీ వంటి యువ హీరోలు ఎంతో చురుకుగా పాల్గొంటారు. అదే మా వరకు వస్తే అంతా సీనియర్ హీరోలే చూసుకుంటారు.

మాపై రామ్ చరణ్ స్పందన..
మాలో లుకలుకలు, సభ్యుల మధ్య విబేధాలున్నాయని అందరికీ తెలిసినా..మొన్నటి కార్యక్రమంలో అంతా బట్టబయలైంది. సినీ పెద్దలు వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారని అందరూ అనుకున్నా.. వారి ముందే గొడవలు జరగడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ విషయంపై రామ్ చరణ్ స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారని, సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారని చెప్పాడు.

మంచి పరిణామం..
ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ 65 శాతం పూర్తైందని, జూలై 30న ఈ సినిమా విడుదలవుతుందని తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి హాజరు కావడంపై స్పందిస్తూ.. సూపర్స్టార్ మూవీకి మెగాస్టార్ లాంటి వ్యక్తి వెళ్ళడం మంచి పరిణామని వ్యాఖ్యానించారు. తక్కువ సమయంలో సినిమా షూటింగ్లు పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు ఆర్ధికంగా లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

సంక్రాంతి సినిమాలన్నీ హిట్ కావాలి..
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టార్ల హవా నడుస్తుందని, ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నాడు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు విజయవంతం కావాలని కోరుకున్నాడు. విజయవాడలో హ్యాపీ మొబైల్ స్టోర్ను ప్రారంభించేందుకు వెళ్లిన రామ్చరణ్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.


Click it and Unblock the Notifications











