అక్కడ అవార్డు రాకపోయినా.. రామ్ చరణ్కు ఇక్కడ వచ్చింది.. మెగా ఫ్యాన్స్ ఖుషీ
రెండు రోజుల క్రితం భారతదేశ 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 సంవత్సరానికి గానూ ఈ అవార్డులను ప్రకటించారు. వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉన్నా.. లోక్సభ ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకుముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు అందజేశారు.
అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు వచ్చాయి. అయితే, ఉత్తమ నటుడు అవార్డు మాత్రం ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్లకు సంయుక్తంగా ఇచ్చారు. దీంతో మెగా అభిమానులతో పాటు టాలీవుడ్కు చెందిన ఎంతో మంది నిరాశకు గురయ్యారు. కారణం.. 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ నటనకు అవార్డు దక్కుతుందని చాలా మంది అనుకున్నారు. ఆ మధ్య దీనికి సంబంధించిన కొన్ని వార్తలు కూడా వచ్చాయి.

జాతీయ అవార్డు రాలేదని బాధ పడుతున్న మెగా ఫ్యాన్స్కు ఒకరోజు వ్యవధిలోనే శుభవార్త వినిపించింది. అదే.. రామ్ చరణ్ ఉత్తమ హీరోగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డు అందుకోవడం. అవును.. ప్రముఖ న్యూస్ చానెల్ సాక్షి ప్రతి ఏటా అందించే ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో ఉత్తమ నటుడిగా రామ్చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్అశ్విన్, ఉత్తమ చిత్రం గా 'మహానటి'కి అవార్డులు ప్రదానం చేశారు.


అలాగే, జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు దక్కించుకున్నారు. అంతేకాదు, యాంకర్ అనసూయకు ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా దక్కింది. 'రంగస్థలం'లో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు ఈ అవార్డు దక్కడం విశేషం. వీరితో పాటు చాలా మంది నటులు, సాంకేతిక నిపుణులు సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications











