విశాఖ దుర్ఘటన.. ఓరి దేవుడా ఈ ప్రపంచానికి ఏమైంది?.. స్పందిస్తున్న టాలీవుడ్
విశాఖపట్నంలో బుధవారం అర్థరాత్రి జరిగిన విషవాయువు దుర్ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు టాలీవుడ్ సెలెబ్రిటీలంందరూ స్పందిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి ప్రమాదవశాత్తు లీకైన విషవాయువుతో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. గాయపడిన ఎంతో మంది త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే చిరంజీవి, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ వంటి స్టార్స్ స్పందించగా.. తాజాగా మిగతా హీరోలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఆ దృశ్యాలతో హృదయం బద్దలైంది..
రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘విశాఖ గ్యాస్ లీక్ ఘటన దృశ్యాలను చూసి నా హృదయం బద్దలైంది. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారిని త్వరగా కోలుకునేలా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఆశిస్తున్నాను. విశాఖ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నా'ని ట్వీట్ చేశాడు.

ఈ ప్రపంచానికి ఏమైంది?
దేవీ శ్రీ ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఓరీ దేవుడా.. ఈ ప్రపంచానికి ఏమైంది? వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన విని నా హృదయం బద్దలైంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి.. వైజాగ్ ప్రజలంతా బాగుండాలని కోరకుంటున్నాను. ఇక మరెవ్వరికీ ఏమీ కాకూడదని ప్రార్థిస్తున్నాన'ని ట్వీట్ చేశాడు.

హృదయ విదారకం..
పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ‘విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజల భయకంపితులు కావడం. 8 మంది మృతి చెందటం... వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా'ని సుదీర్ఘ పోస్ట్ చేశాడు.
Recommended Video

ఎంతో కలత చెందాను..
వెంకటేష్ స్పందిస్తూ.. ‘విశాఖ గ్యాస్ లీక్ ఘటన వార్త విని ఎంతో కలత చెందాను.. మరీ ప్రత్యేకంగా ఇలాంటి విపత్కర పరిస్థితిలో మరో దుర్ఘటన జరగడం మరింత బాధ పెడుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా'ని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











