మరో రెండు సినిమాలు సైన్ చేసిన రామ్ చరణ్
రామ్ చరణ్ వరసగా జంజీర్ రీమేక్,ఎవడు,చెర్రీ చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన వచ్చే సంవత్సరం కూడా ఇలాగే బిజీగా ఉండేలా అప్పుడే ప్లాన్ చేసుకుని మరో రెండు సినిమాలు సైన్ చేసినట్లు సమాచారం. అవి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్,బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ మసాలా యాక్షన్ చిత్రం. ఈ రెండు చిత్రాలుకు రీసెంట్ గా కథలు ఓకే చేసి సైన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక ఉపాసనతో పెళ్లి తరవాత రామ్చరణ్ మళ్లీ షూటింగ్ హడావుడిలో పడిపోయారు. వాటికన్ సిటీ నుంచి తిరిగొచ్చిన ఆయన వినాయక్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్, అమలాపాల్ కథానాయికలు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి. దానయ్య నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది.
రామ్చరణ్తో పాటు మిగిలిన ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ''యాక్షన్, వినోదం మేళవించిన చిత్రమిది. చరణ్ పాత్రని కొత్త కోణంలో తీర్చిదిద్దుతున్నాం. కథానాయికలు ఇద్దరున్నా.... రెండూ కీలకమైన పాత్రలే'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. చరణ్ చిత్రానికి తమన్ సంగీతం అందించడం ఇదే తొలిసారి. ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.
అలాగే ఎవడు చిత్రం షూటింగ్ కూడా వివాహం ముందు వరకూ జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రంలో అల్లు అర్జున్ మరో కీ రోల్ చేస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నాడు. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇప్పటివరకూ తెలుగు తెరపై ఊహించని విధంగా కధనం ఉంటుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











