పంచె కట్టులోనే చరణ్ పెళ్లి పీటలపై...
సంప్రదాయబద్ధంగా, తెలుగుదనం ఉట్టిపడేలా రామ్ చరణ్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు వస్త్రాలు దగ్గరనుండి అంతా తెలుగుతనం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుని తీర్చిదిద్దారు. ఇదే విషయాన్ని డిజైనర్స్ కి తెలియచేసి మరీ దుస్తులను రెడీ చేయించారు. వధూవరులు ఉపాసన, చరణ్ వివాహానికి ప్రముఖ డిజైనర్లు దుస్తుల్ని సిద్ధం చేశారు.
ఈ వివాహంలో ...వివాహ వేదిక దగ్గర తరుణ్ తహిల్యానీ తీర్చిదిద్దిన చీరను ఉపాసన ధరిస్తారు. ఈ చీర దక్షిణాది సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా బంగారు వర్ణంలో ఉంటుంది. రాణి పింక్ రంగు చీరను కూడా తరుణ్ సిద్ధం చేసినట్లు తెలిసింది. చరణ్ వస్త్రాల్ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. సంప్రదాయబద్ధమైన పంచె కట్టులోనే చరణ్ పెళ్లి పీటలపై కూర్చొంటారు. వధూవరుల కోసం చిరు అభిమానులు ప్రత్యేక కొబ్బరి బొండాలను తీసుకొచ్చారు. అలాగే భద్రాచలం నుంచి తలంబ్రాల బియ్యం వచ్చాయి.
రాంచరణ్ తేజ, ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనల వివాహం ఘనంగా జరుగుతోంది. కల్యాణ మంటపానికి వధూవరుల కుటుంబీకులు బుధవారం అర్ధరాత్రే చేరుకున్నారు. ఇక్కడే వధూవరులను అలంకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన ఈ పెళ్లి కార్యక్రమానికి హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్లోని ఫామ్హౌస్ను సిద్ధం చేశారు. పెళ్లి మండపం, పరిసరాలను సినీ ఆర్ట్ డెరైక్టర్ ఆనంద్సాయి అత్యంత ఖరీదైన హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
వరుడు, వధువు కుటుంబ బంధువులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులలో మూడు వేల మందికి మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానాలు అందజేశారు. వివాహానికి ఆహ్వానితులు మినహా ఇతరులు ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వివాహ ఆహ్వాన పత్రికతోపాటు లోపలికి వెళ్లేందుకు రహస్య సంకేతంగల కార్డులను అందజేశారు.ఉదయం 11 గంటల వరకు పెళ్లి సందడి ఉంటుంది. అతిథులకు అల్పాహారం అందించేందుకు పలు రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో రిసెప్షన్ ఉంటుంది. ఈ విందుకు సంబంధించిన ఏర్పాట్లను చిరంజీవి కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 10 వేల మంది హాజరవుతారని అంచనా.


Click it and Unblock the Notifications











