తండ్రి బాటలో రామ్ చరణ్: వాటా ఇవ్వాలని డిమాండ్!
హైదాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలి నాళ్లలో నటీనటులకు జీతాలు ఇచ్చేవారు. తర్వాత సినిమాకు ఇంత అని రెమ్యూనరేషన్ ఇవ్వడం మొదలైంది. అనంతరం రోజుకు ఇంత రెమ్యూనరేషన్ అనే లెక్కలు వచ్చాయి. అయితే సినిమా లాభాల్లో వాటా తీసుకునే సాంప్రదాయానికి తెలుగు సినీ పరిశ్రమలో శ్రీకారం చుట్టింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారు పరిశ్రమలో టాప్ రేంజికి వెళ్లాక లాభాల్లో వాటా తీసుకోవడం మొదలు పెట్టారు.
నిన్న మొన్నటి వరకు సినిమాకు ఇంత అంటూ కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్న రామ్ చరణ్ ఇకపై సినిమా లాభాల్లో వాటా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ తమిళ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చరణ్ మేనమామ అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. లాభాల్లో వాటా అనే కాన్సెప్టు ఉన్నపుడు నష్టలు వచ్చినపుడు కూడా రెమ్యూనరేషన్లో కోత విధించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్దపడే రామ్ చరణ్ ఈ డీల్ కు ఓకే అన్నట్లు తెలుస్తోంది.

సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నా... రామ్ చరణ్ సోదరి శ్రీజ వివాహం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం రామ్ చరణ్ అన్ని పనుల నుండి ఫ్రీ కావడంతో సినిమా షూటింగులో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
తమిళ చిత్రం 'థాని ఒరువన్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం 'ధృవ' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. తర్వాతి షెడ్యూల్ కాశ్మీర్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ పవర్ ఫుల్ ఫోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అరవిందస్వామి ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా, అసీమ్ మిశ్రా సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. దసరా నటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications