పవన్ పార్టీపై వర్మ ట్వీట్: చిరుపై సెటైర్లు, మూర్ఖత్వమే అని వ్యాఖ్య!
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని, ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా రోజుల క్రితమే గొంతెత్తిన సంగతి తెలిసిందే. తన కోరిక ఎట్టకేలకు నిజరూపం దాలుస్తున్న నేపథ్యంలో వర్మ మరోసారి తన ట్విట్టర్ పేజీలో సంచలన కామెంట్స్ చేసారు. చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన వర్మ, పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీకి జై కొట్టారు.
ట్విట్టర్లో వర్మ వ్యాఖ్యానిస్తూ....'జన సేన కంటే గొప్ప పేరు ఒక పార్టీకి ఉండే అవకాశం లేదు. శివ సేన కన్న 1000 రెట్లు బెటర్. పేరులోనే ఇంతుంటే పార్టీలో ఎంతుంటుందో. ప్రజారాజ్యంలో జరిగిన అవకతవక పనులు జనసేన పార్టీలో అసలు జరుగవని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. పవన్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు కనుక జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించే తెలివి తెలుగువాళ్లకి ఉందని ఆశిస్తున్నాను' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

'నా ఉద్దేశ్యంలో తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్నవాడెవడైనా సరే కేవలం పవన్ కళ్యాణ్ జనసేనకే ఓటు వేస్తాడు. జన సేన కేవలం కొత్తగా వస్తున్న ఇంకో పార్టీ అనుకుంటే బుద్ది తక్కువ మూర్ఖత్వం, జనసేన జనం కోసం, పవన్ సేన సృష్టిస్తున్న ఒక ప్రభంజనం' అని వర్మ వ్యాఖ్యానించారు.
ఇలా వ్యాఖ్యానించడం ద్వారా.... చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ అవకతవకలకు పాల్పడిందని చెప్పకనే చెప్పారు వర్మ. పవన్ కంటే గొప్ప నాయకుడు దొరకడు అని వ్యాఖ్యానించడం ద్వారా......చిరంజీవిని పరోక్షంగా సెటైర్లు విసిరారు వర్మ అని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
పవన్ పార్టీ విషయానికొస్తే...ఈ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఆర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగులో ఆయన రాజకీయ పార్టీని ప్రకటించడంతో పాటు, పార్టీ విదివిధానాలు, తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ గురించి ప్రజలు, అభిమానులు, మీడియా వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











