RGV: పోసాని తర్వాత రాంగోపాల్ వర్మ అరెస్ట్? ఆర్జీవికి ‘రెడ్ బుక్’ నోటీసులు!
రాజకీయ, సినీ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముచ్చెమటలు పట్టిస్తున్నది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తూ అధికారులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, వైసీపీ సానుభూతిపరుడు, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టులతో రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఉలిక్కి పడ్డారు. అయితే తాజాగా పోసాని అరెస్ట్పై ఇంకా చర్చ కొనసాగుతుండగానే మరోసారి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల వెనుక వివరాల్లోకి వెళితే..
కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను 2019 సంవత్సరంలో రిలీజ్ చేశారు. తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం కొనసాగుతుండటంతో ఆ వర్గం వారు సంయమనం పాటించారు. తాజాగా చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆ పార్టీ శ్రేణులు అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలు ప్రాంతాల్లో వర్మపై కేసులు నమోదు చేశారు. దాంతో ఈ వివాదంలో ఆయన ఇరుక్కుపోయారు.

కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. అయితే, యూట్యూబ్ లో మాత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్తోనే విడుదల చేశారు అని మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్కు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆత్మకూరులోనే కాకుండా కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో ఓ వర్గం మనోభావాలు దెబ్బ తీశారనే ఆరోపణలపై ఏపీలోని పలు ప్రాంతాల్లో రాంగోపాల్ వర్మపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు ఫిబ్రవరి 10వ తేదీన నోటీసులు జారీ చేశారు. దాంతో తాను విచారణకు హాజరుకాలేనని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆయన పిటిషన్ను విచారించిన తర్వాత ఆర్జీవిని అరెస్ట్ చేయకూడదని ఆదేశించడంతో ఆ కేసులో ఆయన ఉపశమనం పొందారు.

తన సినిమాల ప్రమోషన్స్, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు అపాయింట్మెంట్స్ ఉన్న కారణంగా తాను విచారణకు హాజరుకాలేనని చెప్పారు. ఆయన తరఫున తన న్యాయవాదిని గుంటూరు సీఐడీ ఆఫీస్కు పంపించారు. తనకు 8 రోజుల గడువు కావాలని కోరాడు. ఈ క్రమంలో 8 రోజులు పూర్తయిన సందర్భంగా ఆర్జీవికి గుంటూరు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు పంపించడంతో మరోసారి ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది.
గతంలో నవంబర్ 29న కేసు నమోదు కాగా వర్మకు నోటీసులు జారీ చేసినప్పుడు ఆయన అరెస్ట్ జరుగుతుందనే ప్రచారం మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. ఆ సమయంలో ఆర్జీవి ఆఫీస్కు భారీగా పోలీస్ అధికారులు వచ్చారు. అయితే పోలీసులకు ముఖం చూపించకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని ఆయన అదృశ్యం కావడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో కొనసాగుతుండగానే ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారనే ప్రశ్నకు ఆర్జీవి రూపంలో మీడియాకు సమాధానం దొరికింది. ఇటీవల రెడ్ బుక్ తన పని తాను చేసుకొని పోతుంది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదని టీడీపీ నేత, మంత్రి లోకేష్ వ్యాఖ్యనించిన తర్వాత ఈ నోటీసులు రావడంతో పోసాని అరెస్ట్ తర్వాత ఆర్జీవే లిస్టులో ఉన్నారా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











