మోడీపై వర్మ సినిమా, అమితాబ్ హీరో?
హైదరాబాద్: వివాదాలకు, వివాదాస్పద సినిమాలకు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని అడ్డంకులు కలిగించినా తాను అనుకున్న సినిమా తీసే వరకు నిద్రపోడు. గతంలో బాల్ థాకరే జీవితంపై ‘సర్కార్', పరిటాల రవీంద్ర జీవితంపై ‘రక్త చరిత్ర' చిత్రాలు తెరకెక్కించి పెద్ద దుమారానికి తెరలేపారు.
చివరకు ముంబై దాడుల ఘటనపై ''26/11 ఇండియాపై దాడి'' సినిమా తీసి తన ప్రత్యేక చాటుకున్నాడు. తరచూ దెయ్యాలు, ఇతర చెత్త సినిమాలు తీస్తూ విమర్శల పాలవ్వడం....అప్పుడప్పుడు నిజజీవిత సంఘటనలను తెరపై చూపించి విమర్శలకు ప్రశంసలు అందుకోవడం వర్మకే చెల్లింది.

త్వరలో రామ్ గోపాల్ వర్మ ప్రధాని నరేంద్ర మోడీ జీవితంపై సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ కొట్టు నుండి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన మోడీ జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి వర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మోడీ పాత్రకు అమితాబ్ను ఎంచుకునే ఆలోచనలో ఉన్నాడట. మరి వర్మ ఆలోచన ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.
ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘సావిత్రి/శ్రీదేవి' సినిమా ద్వారా కొత్త వివాదానికి తెరలేపారు. ఒక అబ్బాయి ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ఆధునిక జీవనశైలి వలన ఏ విధంగా ప్రభావితమయ్యాడు? దాని వలన, ఆ అబ్బాయితో పాటు... అతని చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి దుష్ర్పరిణామాలకు లోనయ్యారనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











