MAA ఓ సర్కస్ కంపెనీ.. సిని ‘మా’ సభ్యులంతా జోకర్లు.. రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఈ సంస్థకు జరిగిన ఎన్నికలు దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా అల్లరిపాలయ్యాయి. ప్రతిష్టాత్మకమైన ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అనేక విమర్శలకు గురికావడం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. మా ఎన్నికల విషయంలో సినీ వర్గాల్లో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఆ వివారాల్లోకి వెళితే..

గందరగోళం మధ్య ఎన్నికలు
మా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి ప్రకాశ్ రాజ్ ప్యానెల్, విష్ణు మంచు ప్యానెల్ ఒకరిపై మరొకరు దుర్బాషలు ఆడుకొన్నారు. ఇరు జట్లకు సంబంధించిన వ్యక్తులు దూషణలకు పాల్పడ్డారు. పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి సినీ ఓటర్లను, అలాగే ప్రజలను, మీడియాను గందరగోళంలోకి నెట్టారు. దాంతో గత రెండు వారాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. దాంతో మా ప్రతిష్ట మరోసారి రోడ్డునపడిందనే వ్యాఖ్యలు వినిపించాయి.

ఎన్నికల వేళ దాడులు, దూషణలు
ఇక ఎన్నికలు జరిగిన అక్టోబర్ 10వ తేదీన జరిగిన గందరగోళం అంతా ఇంతా కాదు. ప్రేక్షకులకు, సినీ వర్గాలను కూడా ఈ ఎన్నికల తంతు ఆవేదన గురిచేసింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకొనేంతగా ప్రయత్నాలు చేశారు. ఓ వర్గం తమపై బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారి బ్యాలెట్లను ఇంటికి తీసుకెళ్లి తారుమారు చేశారనే ఆరోపణలు వినిపించాయి.

వివాదాల మధ్య మంచు విష్ణు ప్రమాణం
ఇలాంటి వివాదాలు, ఆరోపణల మధ్య ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా అస్త్రాలు సంధించారు. ఆ తర్వాత విష్ణు మంచు అధ్యక్షుడిగా, ఆయన ప్యానెల్ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ వేడుక కూడా గందరగోళం మధ్య, వ్యక్తిగత విమర్శలతో సాగడం మరింత చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితులపై రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్లు చేశారు.

మా ఓ సర్కస్.. సభ్యులంతా జోకర్లు
మా సంస్థపై, సభ్యులపై రాంగోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిని 'మా' పీపుల్ తాము ఓ సర్కస్ కంపెనీ అని ఆడియెన్స్కు స్పష్టంగా చెప్పారు. సిని 'మా' ఓ సర్కస్ కంపెనీ, అందులోని వారంతా జోకర్లు అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైయ్యాయి.

ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం
ఇదిలా ఉండగా, మా ఎన్నికల వివాదం ఫలితాల తర్వాత జోరుగా కొనసాగుతున్నది. ఎన్నికలు జరిగిన జూబ్లీ హిల్స్ స్కూల్కు వెళ్లి ప్రకాశ్ రాజ్ సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లను ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ను రిక్వెస్ట్ చేశారు. దాంతో ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశం కలుగుతున్నది.

ఆర్జీవి ట్వీట్పై మంచు మనోజ్ ఘాటుగా
రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై మనోజ్ మంచు తీవ్రంగా స్పందించారు. రాంగోపాల్ వర్మ ట్వీట్కు బదులిస్తూ మీరు రింగ్ మాస్టరా అంటూ కామెంట్ చేశారు. సినిమా వాళ్లంతా జోకర్లు, అదో సర్కస్ కంపెనీ అంటూ సోషల్ మీడియాలో ఆర్జీవి చేసిన కామెంట్లకు నెటిజన్లు ఘాటుగా స్పందించారు. మీరు కూడా పెద్ద జోకర్ అంటూ కామెంట్లు పెడుతుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











