RGV: కేఏ పాల్ పై ఆర్జీవీ 'బాంబు'లు.. 'భయంకరమైన వైరస్' అంటూ సెటైర్లు
రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన స్టైల్ లో ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీకే కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. ట్వీట్సే కాకుండా నిజ జీవితపు సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కిస్తూ సంచలనాలకు నిలయంగా మారారు.
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎన్నికలు కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని చివరి వరకు స్ట్రాంగ్ చెప్పారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కానీ ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ట్వీట్స్ కు రారాజు అయిన ఆర్జీవీ తాజాగా కేఏ పాల్ పై ట్వీట్ల వర్షం కురిపించారు.

నచ్చితే చూడండి లేకుంటే లేదు..
రామ్ గోపాల్ వర్మ.. ట్వీట్ గానీ, కామెంట్ గానీ, సినిమా గానీ.. ఏదైతే ఏంటీ.. దానితో ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఆయన ట్వీట్స్, కామెంట్స్ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సినిమాలను కూడా తనకు నచ్చినట్లుగా తెరకెక్కిస్తారు. నచ్చితే చూడండి లేకుంటే చూడకండి ఎన్నోసార్లు బాహటంగానే స్టేజీలపై చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఇక తాజాగా మునుగోడు ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి..
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హంగామా ఓ రేంజ్ లో జరిగింది. పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరిగా అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుమంట్ల ప్రభాకర్ రెడ్డి విజయ ఢంకా మోగించారు. ఈ ఎలక్షన్స్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే.

దర్శనమిచ్చిన కేఏ పాల్ వీడియోలు..
మునుగోడు బై ఎలక్షన్స్ ప్రచారంలో కేఏ పాల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయన మాటలు తెగ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కేఏ పాల్ వీడియోలు, మీమ్స్, ట్రోలింగ్సే దర్శనమిచ్చాయి. అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తామని చాలా ధీమాగా మాట్లాడారు కేఏ పాల్. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక అంతా తారుమారు అయింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేఏ పాల్ ఓటమి పాలయ్యాడు.

ఈవీఎంలు మార్చారని ఆరోపణలు
ఓటమి అనంతరం కూడా ఆయనకు లక్షా 10 వేల ఓట్లు వచ్చాయని, ఈవీఎంలు మార్చారని పలు ఆరోపణలు కూడా చేశారు. అతన్ని ఓడించేందుకు అధికార పార్టీ కుట్ర చేసిందని విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలు, కేఏ పాల్ పై ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియా వేదికగా కేఏ పాల్ పై వరుసగా ట్వీట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

బాంబులు వేయిస్తున్నారని..
"కేఏ పాల్ తన స్నేహితులైన ఐసిస్, ఆల్కాయిదా వంటి వారి సహాయం తీసుకుని మునుగోడు నియోజకవర్గంపై బాంబులు వేయిస్తున్నారని విన్నాను. మునుగోడు ప్రజలారా దయచేసి పరుగెత్తండి". అలాగే "కేఏ పాల్ జీసెస్ మహిమను ఉపయోగించి మునుగోడులో పంటలు పండకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలిసింది. ఓ భయంకరమైన వైరస్ తో అక్కడి ప్రజలకు సోకేలా చేయిస్తున్నారని తెలిసింది".

అమెరికన్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడం..
"ఎన్నికల్లో మునుగోడు ప్రజలు తరిమేశారు కాబట్టి ఇక కేఏ పాల్ 2024లో అమెరికన్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడం మంచి విషయమే. అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గంపై ఓ న్యూక్లియర్ బాంబు వేస్తాడు" అంటూ ట్వీట్స్ లో రాసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ తో కేఏ పాల్ ను ఆర్జీవీ మించిపోయారని పలువురు నెటిజన్లు అంటున్నారు.


Click it and Unblock the Notifications











