వెంటాడుతున్న వినాయకుడు: వర్మకు ముంబై కోర్టు సమన్లు!
రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 8 లోపు కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
ముంబై: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. వినాయకుడిపై ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి ఆయనకు ఈ సమన్లు జారీ అయ్యాయి. కేసు విచారణలో భాగంగా ఆగస్టు 8వ తేదీలోపు కోర్టు ఎదుట హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
2014లో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా హిందూ గాడ్ వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయగా.... ఆయన్ను ఈ కేసు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. 'అవయవాలే సరిగా లేని వినాయకుడు తన భక్తుల బాధలు తొలగిస్తాడట.. విచిత్రంగా ఉంది' అంటూ రామ్ గోపాల్ వర్మ అప్పట్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ కమ్యూనికేషన్స్ ఎండీ వివేక్ శెట్టి ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. దీనిని విచారించిన కోర్టు ఆర్జీవీకి సమన్లు జారీ చేసింది. తన వ్యాఖ్యలకు వర్మ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. ఇటీవల వర్మ తన ట్విట్టర్ ఖాతా నుండి కూడా వైదొలగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











