రెమ్యూనరేషన్ : చిరుకు ఎంతో రామ్ చరణ్కి అంతే!
హైదరాబాద్ : మగధీర, రచ్చ, నాయక్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిన రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరో. ఆయన సినిమా అంటే కలెక్షన్ల వర్షమే. దీంతో రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో తాజాగా సరికొత్త విధానాన్ని అనుసరించబోతున్నాడు. తన తండ్రి సినిమాలు చేసేప్పుడు ఏవిధంగా, ఎంత తీసుకునే వాడో తను కూడా అదే రూట్ను ఫాలో అవుతున్నారు. నిర్మాతలు కూడా ఆ రేంజిలో ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.
అప్పుడెప్పుడో చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్.....ఇప్పుడు చెర్రీ తీసుకునే రెమ్యూనరేషన్ సమానం ఎలా అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు మతలబు. అప్పట్లో చిరంజీవి తన సినిమా నైజాం రైట్స్ ఎంత వస్తే అంత మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా తీసుకునే వారు. తెలుగు సినిమాకు అత్యధిక వసూళ్లు సాధించే టెర్రిటరీ నైజాం ఏరియానే. అలా తెలివిగా భారీ మొత్తం రెమ్యూనరేషన్ రూపంలో తన ఖాతాలో వేసుకునే వారు మెగాస్టార్. ఈ దారేదో బాగా లాభసాటిగా ఉండటంతో చెర్రీ కూడా తండ్రి స్ట్రాటజీనే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం ఇటీవల సంక్రాంతికి విడుదలై రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ. 50 కోట్ల వరకు వసూలు చేసింది. నైజాం ఏరియా రైట్స్ కంపేర్ చేస్తూ రామ్ చరణ్ ఈచిత్రానికి దాదాపు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్.
ఇతర వివరాల్లోకి వెళితే...రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న జంజీర్ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్. మే నెలలో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











