డబ్బింగ్ చిత్రాల జోరుకు నిర్మాతల బ్రేకులు
డబ్బింగ్ సినిమాల జోరుకు కళ్లెం వేయాలని తెలుగు ఫిలిం ఛేంబర్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో డబ్బింగ్ సినిమాలు తెలుగులో విపరీతంగా విడుదలవుతూ ఇక్కడి డబ్బులను కొల్లగొట్టకుని పోతున్నట్లు చెబుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలను ఖరారు చేసి, అమలు చేయడానికి ఫిలిం ఛేంబర్ ఓ కమిటీని వేసింది. సురేష్ బాబు, దిల్ రాజు, విజయేందర్ రెడ్డి, నట్టి కుమార్లతో కూడిన ప్రత్యేక కమిటీ డబ్బింగ్ సినిమాలను నియంత్రిస్తుంది. డబ్బింగ్ సినిమాలపై ఉన్న 20 శాతం పన్నును 50 శాతానికి పెంచాలని కూడా నిర్ణయించారు.
పండుగ రోజుల్లో డబ్బింగ్ సినిమాల విడుదలకు అవకాశం ఉండదు. సంక్రాంతి, దసరా, వినాయక చవితి, దీపావళి పర్వదినాల్లో డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదని, తెలుగు సినిమాల విడుదలకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. డబ్బింగ్ సినిమాలకు సంబంధించి 85 ప్రింట్లకు మించి అవకాశం ఇవ్వకూడదని కూడా అంటున్నారు. ఈ ఆంక్షలు ఇదివరకు ఉన్నవేనని, వాటి అమలు సక్రమంగా జరగడం లేదని, ఇప్పుడు ఆ ఆకాంక్షలను పకడ్బందీగా అమలు చేయాలని మాత్రమే నిర్ణయించారని అంటున్నారు.


Click it and Unblock the Notifications