వాళ్ల పడక గదిలోకి వెళ్లి చేశానా?.. ఆ వాదనే సరికాదు.. రాం గోపాల్ వర్మ
తెలంగాణ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊరట లభించింది. తమ అనుమతి లేకుండా తన కథతో రాం గోపాల్ వర్మ మర్డర్ సినిమా రూపొందించారనే ఆరోపణలు చేస్తూ ఆ సినిమా రిలీజ్ను ఆపాలని అమృతా ప్రణయ్ నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దాంతో ఈ చిత్ర రిలీజ్పై వివాదం నెలకొన్నది. ఇటీవల రాంగోపాల్ వర్మ తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్కు సానుకూలంగా స్పందించిన కోర్టు.. రిలీజ్కు అనుమతి ఇచ్చింది. దాంతో రాం గోపాల్ వర్మతోపాటు సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది. హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత నట్టికుమార్, నట్టి కరుణ , ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్య
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రణయ్ హత్య, అమృత ప్రేమ కథ, మారుతీ రావు వ్యధ భరిత జీవితం ఆధారంగా మర్డర్ సినిమాను తెరకెక్కించలేదు. దేశవ్యాప్తంగా జరిగిన అలాంటి సంఘటనలను స్పూర్తిగా తీసుకొని మర్డర్ సినిమాను తెరకెక్కించానని స్పష్టం చేశారు. అయితే మర్డర్ సినిమాకు, అమృతకు సంబంధం లేదని చెబుతున్నప్పుడు.. ఆమె ఫోటోను ఎందుకు ట్వీట్ చేశారనే విషయంపై లేవనెత్తిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు..
మర్డర్ సినిమా వల్ల అమృత జీవితంపై ఎలాంటి ప్రభావం పడదు. ఇప్పటికే ఆమె జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అలాంటి సంఘటనలే రోజు పేపర్లో చూస్తున్నాం. ఇక ఈ విషయంలో కొత్తగా చెప్పాల్సి ఏముంది. ఈ విషయంలో వస్తున్న అపోహలు సరైనవి కావు అని రాం గోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఎవరి జీవితాలను కించ పరుచలేదు
కొందరి జీవితాలను కించపరచడానికి మర్డర్ సినిమాను తీయలేదు. ప్రేమ కథలో కూతురు పట్ల ఓ తండ్రి ఆవేదన, అలాగే ప్రేమికుల మధ్య సున్నితమైన ఎమోషన్స్ ఆధారంగా సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నం చేశాను. ఒకరు తప్పు అని.. మరొకరు తప్పు అని చెప్పడానికి మర్డర్ సినిమాను తెరకెక్కిలేదు అని వర్మ తన వాదనను వినిపించారు.

వారి నుంచి అనుమతి అవసరం లేదు
అమృత జీవితం ఆధారంగా మర్డర్ మూవీని తీయనప్పుడు.. వారి నుంచి ఎందుకు అనుమతి తీసుకోవాలి. ఆ అవసరం కూడా లేదు అంటూ రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. అమృత బెడ్ రూమ్లొకి వెళ్లి సినిమా చేశానా. వాళ్ల ఇంటి కిచెన్లో ఏం మాట్లాడుకొన్నారనే విషయంపై సినిమా తీయలేదు. వాళ్ల కథతో నాకు సంబంధం లేదు. ప్రేమ వివాహాలు జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. వాటిలో కొన్ని పాపులర్ అవుతాయి కొన్ని మీడియా దృష్టికి రాకుండా కనుమరుగు అవుతాయి అని రాంగోపాల్ వర్మ పేర్కన్నారు.

మర్డర్పై వివాదం ఇలా.. .
వివాదాస్పదంగా మారిన మర్డర్ చిత్రాన్ని నట్టీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాంగోపాల్ వర్మ తెరకెక్కించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితిలు కీలక పాత్రలను పోషించారు. అయితే ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అమృత, ప్రణయ్ తండ్రి పీ బాలస్వామి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో జరిగిన కోర్టు విచారణకు వర్మ హాజరుకాకండా తప్పించుకోవడం కూడా చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











