వర్మ కొత్త స్కీమ్ వర్కవుట్ అవుతుందా?
హైదరాబాద్ : సినిమాని ఎంత చవకగా తీయొచ్చో 'ఐస్క్రీమ్'తో చూపి, వివాదం లేపి మరీ డబ్బులు చేసుకున్నారు రామ్గోపాల్ వర్మ. సహకార సంఘం సూత్రాన్ని అన్వయించి ఆ సినిమా హిట్ కొట్టానంటున్న ఆయన ఇప్పుడు పంపిణీ విధానంలోనూ మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. సినిమాని థియేటర్ల వారీగా వేలం పెట్టి పంపిణీ చేయనున్నారు. విష్ణు హీరోగా తెరకెక్కిస్తున్న తాజా సినిమాతోనే ఈ పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు వర్మ. ఈ విషయమై మంగళవారం రాత్రి హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
వర్మ మాట్లాడుతూ ''సినిమా వ్యాపారంలో ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలనుకొంటున్నాం. ఇదివరకు సినిమాని బయ్యర్లకు అమ్మేవాళ్లం. ఇక నుంచి ప్రత్యేకంగా బయ్యర్లు అంటూ ఉండరు. ఎవ్వరైనా సినిమాని కొనుక్కోవచ్చు. filmauction.in పేరుతో వెబ్సైట్ని ఏర్పాటు చేసి ఆన్లైన్లో వేలంపాట నిర్వహిస్తాం. థియేటర్ స్థాయిని బట్టి కనీస ధరావతుని నిర్ణయిస్తాం. ఆపైన ఎవరు ఎక్కువకు కొంటే వాళ్లకు ప్రదర్శన హక్కులు ఇస్తాం. వసూళ్ల ద్వారా వచ్చిన ప్రతి పైసా సినిమాని కొన్న వ్యక్తి ఖాతాలో పడిపోతుంది అన్నారు.

అలాగే... ఏ షోకి ఎంత డబ్బు వసూలైందన్న విషయాల్ని కూడా ఎప్పుటికప్పుడు ఆన్లైన్లో ప్రకటిస్తాం. ఏ వ్యాపారంలోనైనా రిస్క్ ఉంటుంది. సినిమాల్లోనూ అంతే. 90 శాతం సినిమాలు నష్టపోతున్నాయంటే అవగాహన లేకపోవడమే కారణం. పంపిణీ వ్యవస్థ లేకుండా సినిమాని ప్రేక్షకుల దగ్గరికి చేర్చడం ఎలా అన్న ఆలోచనలో భాగంగానే ఈ ప్రయత్నం. అలాగని పంపిణీదారుల్ని దూరం పెట్టడం మా ఉద్దేశం కాదు. వాళ్లూ సినిమాని వేలం పాటలో కొనుక్కోవచ్చు'' అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.... ''ఇది రామ్గోపాల్ వర్మ ఆలోచన. చట్టానికి లోబడి న్యాయనిపుణుల సలహా మేరకు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాం. ఈ వెబ్సైట్ ద్వారా ఎవరైనా తమ సినిమాని అమ్ముకోవచ్చు. వేలం పాటలో పాల్గొనదలిచినవారు కనీస ధరావత్తును ముందుగా చెల్లించాల్సి వుంటుంది. వేలం పాటలో సినిమా దక్కించుకోనివారికి డబ్బులు వాపస్ ఇస్తాం'' అన్నారు విష్ణు. బుధవారం తన కొత్త సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు విష్ణు తెలిపారు.


Click it and Unblock the Notifications











