సెన్సార్: ‘రౌడీ’పై ఒక్క వేటు కూడా పడలేదు!
హైదరాబాద్: మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రౌడీ' ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లు, పోస్టర్లు చూస్తే సినిమాలో ఏ రేంజిలో రక్తపాతం ఉందో ఇట్టే తెలిసిపోతుంది. రామ్ గోపాల్ వర్మ తనదైన క్రియేటివిటీతో హీరోయిన్ శాన్వి అందాలను ఓ రేంజిలో చూపించాడు.
ఈ నేపథ్యంలో ఈచిత్రానికి సెన్సార్ బోర్డు వద్ద ఇక్కట్లు తప్పవని అంతా ఊహించారు. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మకు, సెన్సార్ బోర్డు ఆఫీసర్ ధన లక్ష్మికి గతంలో ఓ సినిమా విషయంలో విబేధాలు వచ్చాయి. ఆమెపై వర్మ కేసు కూడా వేసినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో 'రౌడీ' చిత్రం సెన్సార్కు వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
అయితే అందరూ ఆశ్చర్య పడే విధంగా 'రౌడీ' సినిమా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఒక్క కట్ కూడా లేకుండా 'A' సర్టిఫికెట్ పొంది బయట పడింది. రౌడీ చిత్రాన్ని ఏప్రిల్ 4న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చేసింది.

ఈ చిత్రంలో విష్ణు, శాన్వి జంటగా నటించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్కుమార్ నిర్మాతలు. సినిమా గురించి మంచు విష్ణు మాట్లాడుతూ...ఒకటీ, ఒకటీ కలిస్తే ఒకటే! ఇదీ రాయలసీమ లెక్క. ఇక్కడ ఇద్దరు శత్రువులు కలిస్తే ఒక్కరే మిగులుతారు. ఇద్దరు మిత్రులు కలిస్తే.. ఒక్కటైపోతారు. రాయలసీమలో ఉండే 'అన్న' సిద్ధాంతం ఇదే. ఇంతకీ ఆయనేం చేశాడో..? అన్నగా ఏం సాధించాడో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు.
మోహన్ బాబు పాత్ర విష్ణు మాట్లాడుతూ.... ''నాన్నగారి పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వర్మ పనితనం ఎలా ఉంటుందో, ఆయన సాంకేతిక నైపుణ్యం ఏమిటో ఈ సినిమాతో మరోసారి తెలుస్తుంది. విశ్రాంతి సన్నివేశం ముందు ఓ పోరాట సన్నివేశం ఉంది. అది దాదాపు 11 నిమిషాల పాటు సాగుతుంది. ఆ సన్నివేశం నేనే మళ్లీ తెరపై చూస్తే.. ఒళ్లు గగుర్పొడిచింది. అంత శక్తిమంతంగా రూపొందించారు. జయసుధగారి పాత్ర.. మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందుకే విడుదలకు ముందు ప్రత్యేకంగా ఈ సినిమా కొంతమంది మహిళా ప్రేక్షకులకు చూపించాలని నిర్ణయించాం. శనివారం విశాఖపట్నం, బెంగళూరులో 'రౌడీ' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని కొంతమంది ప్రేక్షకులకు చూపిస్తాము''అన్నారు.


Click it and Unblock the Notifications











