కాజల్పై కోరికతో రూ. 60 లక్షలు పోగొట్టుకున్న రిచ్ కిడ్.. పరువు పోతుందని చివరకు.!
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడకం మరింత విస్తృతం అయిపోయింది. దీన్ని చాలా మంది తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, సైబర్ నేరగాళ్ల గురించి అయితే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎదుటి వాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో అమాయకుల నుంచి భారీగా నగదును దండుకుంటున్నారు. ఇప్పటికే ఈ తరహా కేసులు ఎన్నో చూశాం. తాజాగా హీరోయిన్ల పేర్లు చెప్పుకుని ఓ యువకుడిని బురిడీ కొట్టించారు సైబర్ మోసగాళ్లు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

హీరోయిన్లను ఎరగా వేసి
తమిళనాడులో ఓ ధనవంతుల కుటుంబానికి చెందిన యువకుడు ఇంటర్నెట్ను బాగా వాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో సైట్లను ఫాలో అవుతుంటాడు. ప్రతిరోజూలాగే ఆరోజు కూడా ఓ వెబ్సైట్ను చూస్తుండగా, యాడ్స్ వచ్చాయి. వెంటనే దాని మీద క్లిక్ చేశాడు. అందులో ‘మీకు నచ్చిన హీరోయిన్ను కలిసే అవకాశం' అని ఉండడాన్ని గమనించాడు.

కాజల్ను ఎంచుకున్నాడు
మీకు నచ్చిన హీరోయిన్ను కలిసే అవకాశం ఇస్తాం అని ఎవరైనా ఆఫర్ ఇస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న సదరు యువకుడు.. మారుమాట లేకుండా కాజల్ అగర్వాల్ను కలవాలనుకుంటున్నట్లు క్లిక్ చేశాడు. వెంటనే ఆమెకు సంబంధించిన వివరాలతో కూడిన ఓ సబ్ విండో ఓపెన్ అయింది.

వ్యక్తిగత వివరాలతో బుక్
కొత్తగా ఓపెన్ అయిన విండోలో యూజర్ వ్యక్తిగత వివరాలు అడిగారు. హీరోయిన్ను కలవాలన్న కోరికతో సదరు యువకుడు తన ఫొటోలు ఇవ్వడంతో పాటు వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని నింపేశాడు. ఈ క్రమంలోనే అతడు.. ధనవంతుల కుటుంబానికి చెందిన వాడిగా సైబర్ నేరగాళ్లు గుర్తించారు. అప్పటి నుంచి అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు.

యాభై వేలతో మొదలై రూ. 60 లక్షలు
తాము అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి డబ్బులు దోచుకున్నారు. మొదట రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ యువకుడు ఆన్లైన్లో ట్రాన్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఇలాగే అతడి నుంచి విడుతల వారీగా రూ. 60 లక్షలు వరకు రాబట్టారు.

డబ్బులు పోయాయి.. పరువు పోతుందని..
డబ్బులు పోవడంతో పాటు పరువుకు భంగం కలిగే అవకాశం ఉండడంతో అతడు ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు దర్యాప్తు ముమ్మరం చేయడంతో అసలు విషయం బయట పడింది. దీంతో పోలీసులు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో కథ సుఖాంతం అయింది. ఈ ఘటన చూసిన తర్వాతైనా ఏవైనా లింక్స్ క్లిక్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుందనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి.


Click it and Unblock the Notifications











