RRR, Radhe Shyam రిలీజ్కు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా.. థియేటర్ల ఓనర్లకు ఊరట
ఆంధ్ర ప్రదేశ్లో సినిమా టికెట్ల రేట్లు, ప్రదర్శనల విషయంలో సంక్షోభం కొనసాగుతున్నది. సినిమా ప్రదర్శనలకు లైసెన్స్ తీసుకోకుండా ఉన్న థియేటర్ యాజయాన్యాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. తొమ్మిది జిల్లాల్లో అనుమతులు లేకుండా ప్రదర్శిస్తున్న థియేటర్లను సీజ్ చేయడం జరిగింది. అయితే థియేటర్ ఓనర్ల యాజమాన్యాలకు కోరిక మేరకు పలు థియేటర్లను ఓపెన్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

తొమ్మిది జిల్లాలో 83 థియేటర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇటీవల ఎగ్జిబిటర్లతో సమావేశం జరిగిన తర్వాత మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా ప్రదర్శనలకు లైసెన్స్ తీసుకొకుండా నడిపే 130కిపైగా థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకొన్నాం. చిత్తూరులో 24, కృష్ణా జిల్లాలో 12 సీజ్ చేసాం. లైసెన్స్ లేని వాళ్ళు స్వచ్ఛంధంగా 22 థియేటర్లు మూసేశారు. తొమ్మిది జిల్లాలో మొత్తం 83 సీజ్ చేశాం. 23 థియేటర్ యాజమాన్యాలపై జరిమానా విధించాం అని తెలిపారు.

RRR, రాధేశ్యామ్ రిలీజ్కు ముందు
అయితే సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చామని డిసెంబర్ 30న ప్రభుత్వ వర్గాల నుంచి ప్రకటన వెలువడింది. అయితే నిబంధనల ప్రకారం నెల రోజుల్లో థియేటర్లో అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని ఆదేశాలు జారీ చేశారు.. దీంతో తొమ్మిది జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించింది. RRR, రాధేశ్యామ్ సినిమాల ముందు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంపై తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ ధన్యవాదాలు తెలిపింది.

ఏపీ సీఎంకు డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు
ఏపీలో సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతినిచ్చిన ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. థియేటర్ల ప్రదర్శనకు అనుమతి నిచ్చిన ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి, సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. మిగతా విన్నపాల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాము అని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ ఓ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది.

సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ సర్కార్ కమిటీ
ఇదిలా ఉండగా, ఏపీలో థియేటర్లు, సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలు, విద్యుత్ రాయితీలు, ఇతర సమస్యల గురించి చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర సంఘాలతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపనున్నారు. సంక్రాంతి పండుగ ముందు ఈ సమస్యలు, వివాదాలకు ఒక ముగింపు లభించే అవకాశం ఉంది అనే విషయం సినీ, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

జనవరి 7న RRR, 12 తేదీన రాధేశ్యామ్
ఇక ఏపీలో కొనసాగుతున్న వివాదాల నడుమ ప్యాన్ ఇండియా చిత్రాలు RRR, రాధేశ్యామ్ చిత్రాలు రిలీజ్కు సిద్దమవుతున్నాయి. RRR మూవీ జనవరి 7న, అలాగే రాధేశ్యామ్ చిత్రం జనవరి 14న విడుదల కానున్నాయి. ఈ సినిమాల రిలీజ్కు ముందు సినిమా పరిశ్రమలకు ఊరట లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే.. ఇండస్ట్రీలో కొత్త జోష్ కనిపించే అవకాశం ఉంటుంది అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











