చిరంజీవి-పవన్ మధ్య మాటల్లేవా! మరి ఇదేంటి?
హైదరాబాద్ : మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి....ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మధ్య కొంత కాలంగా దూరం పెరుగుతూ వస్తుందని, ఇద్దరి మధ్య మాటలు లేవని వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా ఈ ఇద్దరు హీరోల ప్రవర్తన ఉండటం కూడా ఇలాంటి ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ వస్తున్నాయి.
తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి చోటు చేసుకుంది. ఇటీవల చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రెండో సినిమా ప్రారంభం అవగా....చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, అల్లు శిరీష్ తదితరులు హాజరయ్యారు. తొలి సన్నివేశానికి చిరు క్లాప్ కొట్టగా పవర్ స్టార్ కెమెరా స్విచాన్ చేసారు.
అయితే కార్యక్రమం జరిగినంత సేపు చిరు-పవన్ ఎడమొహం, పెడమొహంగానే ఉండటం మరోరిసారి చర్చనీయాంశం అయింది. కెమెరా స్విచాన్ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయాడు. పవన్ కళ్యాణ్ అలా వెళ్లిపోవడంతో చిరంజీవి అలా చూస్తుండిపోయారు. ఇద్దరి మధ్య విబేధాలు సమసి పోలేదు అనడానికి ఇదో నిదర్శనం అని అంటున్నారంతా.
చిరంజీవి రాజకీయ అరంగ్రేటం తర్వాతే ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ విలీనం ప్రతిపాదన వచ్చినప్పటి నుంచే చిరంజీవి-పవన్ కళ్యాణ్ చెడిందని అంటున్నారు. కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కకూడదనే కారణంతోనే ఇలాంటి ఫంక్షన్లకు ఇద్దరు కలిసి మొక్కుబడిగా హాజరవుతున్నారనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











