ముస్లిం దేశాల్లో సినిమా షూటింగ్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు: ప్రభాస్
Recommended Video
ప్రభాస్ నటించిన బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీ 'సాహో' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్కు వరుస ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ నుంచి ఆసక్తికర విషయాలు, ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని అంశాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ... బాహుబలి: ది బిగినింగ్ విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భాన్ని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. పీఎం నుంచి పొగడ్తలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.

మోడీగారు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు
ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ, "బాహుబలి చిత్రం భారతదేశంలో 90 శాతం చిత్రీకరించబడిందని, ఈ ప్రాజెక్ట్ కోసం చిత్ర బృందం 10 సంవత్సరాలు కష్టపడిందని మేము మోడీగారితో చెప్పాము. బాహుబలి గురించి ఆయన పలు విషయాలు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.' అని గుర్తు చేసుకున్నారు.

ముస్లిం దేశాల్లో షూటింగ్ చేయాలన్నారు
ఈ సందర్భంగా ఇంటర్వ్యూయర్ ప్రభాస్, మోడీ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. "మోడీగారు కొన్ని ముస్లిం దేశాల పేర్లను షూటింగ్ కోసం సూచించారు. ఆ పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను... అక్కడ లొకేషన్లు బాగున్నాయని, ఆ దేశాల్లో కూడా మనలాంటి ప్రజలు ఉన్నారని చెప్పారు' అని ప్రభాస్ తెలిపారు.

సాహో షూటింగ్ అక్కడ జరుపలేదు
‘సాహో' షూటింగ్ ప్రధాని మోడీ సూచించిన ప్రదేశాలలో జరిగిందా? అనే ప్రశ్నకు.... లేదు అని ప్రభాస్ బదులిచ్చారు. బాహుబలి విజయం తర్వాత 2015లో చిత్ర బృందంతో కలిసి ప్రభాస్ ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మాజీ బిజెపి నాయకుడు, 1999 నుండి 2004 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

రాజకీయాలపై ప్రభాస్ రియాక్షన్
రాజకీయాల్లో చేరడానికి ఆసక్తి ఉందా అని అడిగిన ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ... పాలిటిక్స్ నా స్వభావానికి సరిపోవు అన్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ను రద్దు అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో... తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల షూటింగ్ జమ్ముకశ్మీర్లో జరుపాలని సూచించిన సంగతి తెలిసిందే.

సాహో
ప్రభాస్ సాహో ఆగస్టు 30న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో స్క్రీన్లలో విడుదల కానుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించారు.


Click it and Unblock the Notifications











