జాతీయ పురస్కారం అందుకున్న ‘ఈగ’ నిర్మాత
హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గ్రాఫికల్ వండర్ చిత్రం 'ఈగ'. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఈచిత్రం 60వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. శుక్రవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ చిత్రం విజువల్ ఎపెక్ట్స్కి కూడా జాతీయ అవార్డు దక్కింది. ఈ అవార్డును హైదరాబాద్కు చెందిన 'మకుట విఎఫ్ఎక్స్' సంస్థ ప్రతినిధి పీటర్ డ్రాపర్ అందుకున్నారు. 'ఈగ' చిత్రానికి జాతీయ స్థాయిలో రెండు పురస్కారాలు లభించడం పట్ల సాయి కొర్రపాటి తన ఆనందం వ్యక్తం చేసారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్ర ధారులుగా రాజమౌళి దర్శకత్వంలో సాయి కొర్రాపాటి నిర్మించిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే.
అదే విధంగా 'ఈగ' చిత్ర ఇటీవల బి. నాగిరెడ్డి అవార్డుకు ఎంపికయింది. విజయ సంస్థల అధినేతల్లో ఒకరైన సుప్రసిద్ధ నిర్మాత, స్వర్గీయ బి.నాగిరెడ్డి పేరిట ఆయన కుటుంబ సభ్యులు బి. నాగిరెడ్డి పురస్కారాన్ని గతేడాది ప్రారంభించారు. కుటుంబ విలువలు, సందేశం, వినోదం, వాణిజ్య అంశాలు మేళవించడంతో పాటు విశేష జనాదరణ పొందిన చిత్రాలను నిర్మించే నిర్మాతలకు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications











