శుభలేఖతో షాక్ ఇస్తున్న సాయికుమార్
హైదరాబాద్: క్యారెక్టర్ ఆర్టిస్టు సాయికుమార్ కుమార్తె జ్యోతిర్మయి పెళ్లి రిసెప్షన్ కృష్ణఫల్గుణతో ఆగస్ట్ 9 రాత్రి 7 గంటలకు హైదరాబాద్లోని ఒక ఖరీదైన హోటల్లో ఘనంగా జరగనుంది. ఈ మేరకు సాయికుమార్ పరిశ్రమలోని తన ఆప్తులకు వివాహ శుభలేఖలు పంచుతున్నారు. ఆ శుభలేఖలలో ప్రత్యేకత ఏమిటంటే...అవి మాట్లాడే శుభలేఖలు కావటం. అవి అందుకున్నవారు మొదట అందులోంచి సాయికుమార్ వాయిస్ విని షాక్ అయ్యి తర్వాత నవ్వుకుంటున్నారు. ఇంతకాలం తన గొంతుతో పదిమందినీ ఆకట్టుకున్న సాయికుమార్ కూతురు వివాహానికి పలువుర్ని ఆహ్వానించే విధానంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది ఇంట్లో సాయికుమార్ గొంతు వినపడుతోంది. ఇంతకాలం తన గొంతుతో ప్రేక్షకులను, పరిశ్రమను అలరించిన సాయికుమార్ ఇప్పుడు తనదైన శైలిలో తన కుమార్తె వివాహానికి ''మీరంతా తప్పక రండి. రాకపోతే నేను ఊరుకోను (ప్రేమగానే)'' అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ను పరిశ్రమలోని పలువురికి అందజేస్తున్నారు. ఆహ్వాన పత్రిక అందినవారికే అక్కడ ప్రవేశం అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
ఆ కార్డులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... చాలామంది సినిమావాళ్లలానే ఆ కార్డు కూడా చాలా రిచ్గానే ఉంది. దీనికి అదనంగా కార్డ్ ఓపెన్ చేయగానే పెళ్లికి ఆహ్వానం పలుకుతున్న ఆయన 'వాయిస్' వినపడటమే ఆ ప్రత్యేకత. సాయికుమార్ నుంచి పెళ్లి పత్రిక వచ్చిందనగానే పెళ్లి వివరాలు తెలుసుకుందామని, పత్రిక ఓపెన్ చేసి చూసినవారికి అనుకోని రీతిలో ఆయన వాయిస్ కూడా తోడై చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ విధంగా వినూత్న శైలిలో ఆడియో రికార్డ్ చేసి, వివాహ పత్రిక పంచడం బహుశా తెలుగు పరిశ్రమలో ఇదే ప్రథమం అని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











