Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్, హరికృష్ణ పెళ్లికి గైర్హాజరుపై.....'సాక్షి' కథనం
హైదరాబాద్: టాలీవుడ్ సినీహీరో, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని వివాహం మతుకుమిల్లి శ్రీభరత్తో హైటెక్ప్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక బాలయ్య అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ పెళ్లిలో హరికృష్ణ,జూ.ఎన్టీఆర్ ఇద్దరూ హాజరుకాలేదు. అయితే కళ్యాణ్ రామ్ ఉత్సాహంగా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు వివాహ ఆహ్వానం పంపలేదని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ప్రముఖ దిన పత్రిక 'సాక్షి' లో 'నందమూరి కుటుంబంలో చిచ్చు' అంటూ ఓ కథనం ఈ రోజు ప్రచురితమైంది. దాంతో ఈ విషయం అంతటా చర్చనీయాంసంగా మారింది.
బాలయ్య ఇంట శుభకార్యానికి ఆయన సోదరుడు, టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవటం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది. అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ వివాహానికి హాజరయ్యారు. మరోవైపు అసలు జూనియర్ ఎన్టీఆర్కు వివాహ ఆహ్వానం అందలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ల మధ్య ఏర్పడ్డ విభేదాల కారణంగానే ఎన్టీఆర్కు పెళ్లిపిలుపు అందలేదన్న చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ను పెళ్లికి పిలవనందునే హరికృష్ణ కూడా ఈ వివాహా కార్యాక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తేజస్విని వివాహ వేడుకను జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో టీవీలో వీక్షించినట్లు సమాచారం.
బాలయ్య కూతురు తేజస్విని పెళ్లి వేడుకను పురస్కరించుకుని నందమూరి కుటుంబసభ్యులతోపాటు, తెలుగు సినిమా కుటుంబానికి చెందిన వారంతా హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు, కృష్ణం రాజు, మంచు మనోజ్, పరుచూరి బ్రదర్స్, అలీ, రోజా, మంచు లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, తరుణ్, శివాజీ రాజా, సినీ నిర్మాత రామోజీరావు, హీరో ఉదయ్ కిరణ్, కళ్యాణ్ రామ్, రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు.
'సాక్షి' ప్రచరించిన ఆ కథనం...యధాతథంగా.. స్లైడ్ షోలో...
కుటుంబంలో చర్చనీయాంశం..
"నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. నందమూరి బాలకృష్ణ కుమార్తె వివాహం సందర్భంగా ఇవి బయటపడ్డాయి. తన సొంత తమ్ముడి కుమార్తె వివాహానికి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ హాజరుకాలేదు. ఆయనతో పాటు కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ వివాహానికి హాజరు కాలేదు. వీరిద్దరి గైర్హాజరు అటు వివాహ వేదిక, ఇటు టీడీపీ వర్గాల్లో, నందమూరి కుటుంబసభ్యుల్లో చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్ నగరంలో ఉన్నప్పటికీ...
బుధవారం ఉదయం నగరంలోని హైటెక్స్లో బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తిల మనుమడు మతుకుమిల్లి శ్రీభరత్తో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు హరికృష్ణ కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. బుధవారం పార్లమెంటుకు సెలవైనప్పటికీ హరికృష్ణ మాత్రం హైదరాబాద్ రాకుండా ఢిల్లీలోనే ఉన్నారు. నగరంలోనే ఉన్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కూడా వివాహ కార్యక్రమానికి రాలేదు.
బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించకపోవడమే..
జూనియర్ ఎన్టీఆర్ను తన కుమార్తె వివాహానికి బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించకపోవటమే వీరి గైర్హాజరీకి కారణమని తెలిసింది. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానపత్రికను జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణ పంపారు. తన కుమారుడిని బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించకపోవటంతో హరికృష్ణ మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ఈ కారణం వల్లే ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాలేదని సన్నిహితవర్గాల సమాచారం. కొద్ది రోజుల కిందట బాలకృష్ణ నివాసంలో తేజస్వినిని పెళ్లి కూతురును చేశారు. ఈ కార్యక్రమానికి కూడా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు.
సినిమాలు ఫ్లాప్ అంటూ ప్రచారం..
బాలకృష్ణతో హరికృష్ణ, ఎన్టీఆర్లకు సంబంధాలు సరిగా లేవన్నది సర్వత్రా జరుగుతున్న చర్చే. కొంత కాలంగా అవి ముదిరి పాకానపడ్డాయి. దానికి కొనసాగింపుగానే వివాహ వేడుకకు తండ్రి, కుమారుడు దూరంగా ఉన్నారని తెలిసింది. ఎన్టీఆర్ సినిమాలను చూడవద్దని, వాటిని ఫ్లాప్ చేయాలని బాలకృష్ణతో పాటు ఆయన అల్లుడు నారా లోకేశ్ ఒక పథకం ప్రకారం ప్రచారం చేయటం, ఎన్టీఆర్ సినిమాలు ప్రదర్శించాలని నిర్ణయించే థియేటర్లను టీడీపీ నేతలు కొందరు ముందుగానే అద్దెకు తీసుకుని టికెట్లను పార్టీ కార్యకర్తలకు ఉచితంగా పంపిణీ చేసి ఫ్లాప్ అని చెప్పేలా ప్రణాళిక రూపొందించటం కూడా జూనియర్, హరికృష్ణ వివాహానికి దూరంగా ఉండటానికి కారణమని తెలుస్తోంది.
మరో కారణం...
కుటుంబసభ్యులు, బంధువుల వద్ద మామా, అల్లుళ్లు తమను తక్కువ చేసి మాట్లాడటం కూడా వీరు వివాహానికి రాకపోవటానికి గల కారణాల్లో ఒకటని సమాచారం.
ఫ్లెక్సీల విషయంలో నిలదీత..
కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను వివిధ పార్టీల నేతలు వేయించిన ఫ్లెక్సీల్లో ఉపయోగించారు. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో పర్యటించిన బాలకృష్ణ.. ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో వాడకంపై ఆయన వెంటనే స్పందించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ తరువాత, అంతకు ముందు తనకు సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నానీ) టీడీపీని వీడిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ తన కట్టె కాలేవరకూ తాత స్థాపించిన పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. అయినా కూడా ఆయన్ను నమ్మకుండా దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే ఘటనపై వరంగల్లో పర్యటించిన హరికృష్ణ స్పందిస్తూ తన తండ్రి ఎన్ టీఆర్ కొందరివాడు కాదని, అందరివాడని, ఆయన ఫొటోలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు. తాము పార్టీలోనే ఉంటామని ఎన్నిసార్లు చెప్పినా అనుమానపు చూపులు చూసి అవమానించటం వెనుక చంద్రబాబు నాయడుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ హస్తం కూడా ఉందని హరికృష్ణ సన్నిహితులు అనుమానిస్తున్నారు.
తండ్రిని అవమానించారని లోకేశ్..
జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు మేనకోడలు కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. ఈ వివాహ సమయంలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ తగిన గౌరవం ఇవ్వలేదని, నూతన దంపతులను ఆశీర్వదించేందుకు వేదికపైకి వచ్చినపుడు వారిరువురూ ఆయనను కుటుంబ పెద్దగా భావించి పాదాభివందనం చేయలేదని టీడీపీ వర్గాలు బలంగా ప్రచారం చేశాయి. తన తండ్రిని నలుగురిలో జూనియర్ ఎన్టీఆర్ అవమానించారనే కోపంతో ఉన్న లోకేశ్ ఇపుడు తన మామ బాలకృష్ణ ద్వారా ఎన్టీఆర్ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించకుండా అవమానించటం ద్వారా పెళ్లికి రాకుండా చేయటంలో కీలకపాత్ర పోషించారని సమాచారం.
పురందేశ్వరి విషయంలోనూ..
కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కేంద్ర మంత్రి పురందేశ్వరిల కుమారుడు హితేశ్ చెంచురాం వివాహం జరిగింది. ఈ వివాహనికి తమ కుమార్తెను పంపి చంద్రబాబు దంపతులను వారు ఆహ్వానించారు. అయితే ఇద్దరూ ఈ వివాహానికి హాజరు కాలేదు. అంతకు ముందు దగ్గుబాటి దంపతుల కుమార్తె వివాహం జరిగింది. ఈ వివాహానికి చంద్రబాబు దంపతులను స్వయంగా ఆహ్వనించేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి అపాయింట్మెంట్ కోరారు. పురందేశ్వరి స్వయంగా సుమారు 20 మార్లు ఫోన్ చేసినా అటునుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో తన కుమారుడిని పంపి పెళ్లికార్డును చంద్రబాబు దంపతులకు అందజేశారు. అపుడు ఆ వివాహానికి చంద్రబాబు దంపతులు హాజరయ్యారు.