ఆ తెలుగు హీరోలంటే ఇష్టం: సల్మాన్ ఖాన్
హైదరాబాద్: '' తెలుగు హీరోలు చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తమిళ్ నుంచి రజనీకాంత్ అంటే ఇష్టం.'' అని చెప్పారు. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం 'దబాంగ్ 2' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.
అలాగే తాను దక్షిణాది రీమేక్స్ ఆసక్తి చూపటానికి కారణం చెప్తూ...'' ఇక్కడ కొత్త కథలు పుడుతున్నాయి. బాలీవుడ్లో సలీమ్-జావెద్ తరవాత.. కథలు రాసింది ఎవరు? ఆ సినిమాలు దక్షిణాదిన కూడా రీమేక్ చేశారు. ఆ సినిమాల్ని మేం డబ్బులు పోసి మళ్లీ కొనుక్కొన్నాం. దక్షిణాదిన మంచి సినిమాలొస్తున్నాయి. కథని చెప్పే విధానం సరికొత్తగా ఉంటోంది. అందుకే ఇక్కడి సినిమాల్ని రీమేక్ చేసుకొంటున్నా. ''ప్రతీ ఎనిమిదేళ్లకు ఓ కొత్త ట్రెండ్ మొదలవుతుంది. ఇప్పుడు యాక్షన్ సినిమాల హవా నడుస్తోంది. అందుకే ఈ తరహా కథలు ఎంచుకొంటున్నా. ఆ తరవాత కుటుంబ కథా చిత్రాలకు మంచి రోజులొస్తే.. అలాంటి సినిమాల్లో నటిస్తా'' అన్నారు.
ఇక 'దబాంగ్'ని తెలుగులో 'గబ్బర్ సింగ్'గా రీమేక్ చేశారు. అందులోని సన్నివేశాల్ని 'దబాంగ్ 2'లో వాడుకొన్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై సల్మాన్ స్పందించారు. ''అసలు నేను 'దబాంగ్' సినిమాని థియేటర్లో చూడనేలేదు. ఇక 'గబ్బర్ సింగ్' ఎక్కడ చూస్తా? అందులోని సన్నివేశాలు 'దబాంగ్ 2' కోసం వాడుకోలేదు. తెలుగులో ఆ సినిమా బాగా ఆడిందని తెలిసి చాలా సంతోషించా. నిజానికి ఇలాంటి సినిమాల్లో నటించడం చాలా తేలిక'' అన్నారు.
'దబాంగ్ 2' తెలుగు రీమేక్లో ఎవరైతే బాగుంటారు? అని అడిగితే ''ఈ సినిమాకి మా తమ్ముడే నిర్మాత. తనకు ఎవరైతే బాగా డబ్బులిచ్చి, ఈ హక్కులు కొనుక్కొంటారో.. వాళ్లయితేనే బాగుంటుంది'' అని చమత్కరించారు. 'దబాంగ్ 2' ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది.
'దబాంగ్ 2 గురించి చెప్తూ... ''ఓ సాధారణ వ్యక్తికి, అసాధారణ పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాడు? అనేదే 'దబాంగ్ 2'. తొలి భాగానికి మించిన వినోదం ఉంటుంది. సినిమాలో పాటలు బాగుండాలి. వాటి చిత్రీకరణ సరిగ్గా లేకపోతే... ప్రేక్షకులు థియేటర్లోంచి లేచి వెళ్లిపోతారు. అందుకే పాటల విషయంలో శ్రద్ధ తీసుకొంటాను. హీరోయిజం అంటే నాకు ఇష్టం. అది కేవలం యాక్షన్ చిత్రాల్లోనే ఉంటుంది అనుకోను. ప్రేమకథల్లో, కుటుంబ కథాచిత్రాల్లోనూ ధీరత్వం చూపించొచ్చు. నెంబర్ వన్.. అనే మాట నమ్మను. హైదరాబాద్తోపాటు దేశంలోని ఎనిమిది చోట్ల రెస్టారెంట్లు నెలకొల్పే ఆలోచన ఉంది. వాటి ద్వారా లభించిన ఆదాయం నేను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు వెళ్తుంది'' అన్నారు.


Click it and Unblock the Notifications











