పాకిస్తాన్ కసాయి చర్యపై సల్మాన్ ఖాన్ అప్సెట్
నిర్ధోషి అయిన సరబ్ జిత్ సింగ్ను పాకిస్థాన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సల్మాన్ ఖాన్ 2012లోనే ఆన్లైన్ పిటీషన్ ప్రారంభించారు. అభిమానులు, ప్రజల నుంచి సరబ్ జిత్ సింగ్ను విడుదల చేయాలనే అభిప్రాయాలు సేకరించారు. అయితే ఇప్పుడు సరబ్ జిత్ శవమై భారత్కు తిరిగి రావడంపై ఆయన విచారం వ్యక్తం చేసారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
1990లో సరబ్ జిత్ సింగ్ మద్యం మత్తులో సరిహద్దు దాటాడు. పాకిస్థాన్ సైనికులకు దొరికి పోయిన సరబ్ జిత్పై పాకిస్థాన్ తప్పుడుకేసులు పెట్టింది. లాహోర్లో జరిగిన బాంబు పేలుళ్లకు సరబ్జీత్ కుట్రదారుగా పాక్ అభియోగాలు మోపింది. సరబ్ అనుకోకుండా పాక్ సరిహద్దుల్లో ఎంటరవడం తప్ప అంతకుమించి ఏ పాపమూ ఎరుగడని ఆయన కుటుంబ సభ్యులు మొదట్నుంచీ చెబుతున్నారు. అయితే పాక్ పోలీసుల అభియోగాలు వేరే ఉన్నాయి. ఫైస్లాబాద్, లాహోర్, ముల్తాన్లలో పేలుళ్లకు కుట్ర పన్నాడని, ఆయన దగ్గర నాలుగు బాంబులు దొరికాయని కేసు బనాయించారు.
ఆ కేసులో సరబ్జీత్కు లాహోర్ హైకోర్టు మరణశిక్ష విధించింది. అయితే 2008 నుంచి మరణశిక్ష నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. తాను అమాయకుణ్నని సరబ్ పెట్టుకున్న మెర్సీ పిటిషన్లు కొట్టుడుపోయాయి. ముంబై మీద దాడి చేసిన కసబ్, పార్లమెంట్ మీద దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలైనప్పుడే సరబ్కి హెచ్చరికలు మొదలయ్యాయి. అది కూడా సహచర ఖైదీల నుంచే కావడం జైలు అధికారులపై అనుమానాలు కలుగజేస్తోంది.
తీవ్రగాయాలపాలై ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న సరబ్ని మానవతా దృక్పథంతో విడిచిపెట్టాలని ఇండియా కోరింది. ఆయనపై ఉన్న కేసుల తీవ్రత, స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. సరబ్ని ఇండియా పంపకపోయినా.. వేరే దేశమైనా తరలించాలని భారత హైకమిషనర్ పాక్ అధికారులను కోరారు. అయితే దీనికి జవాబివ్వని పాక్.. భారత హైకమిషనర్ ఎప్పుడు కోరితే అప్పుడు సరబ్ను చూసేందుకు మాత్రం అంగీకరించింది. ఇది జరిగిన కొన్ని గంటలకే సరబ్జీత్ చనిపోయాడని ఆస్పత్రివర్గాలు ధ్రువీకరించాయి. 1990 నుంచీ జైలు శిక్ష అనుభవిస్తూ భార్యా, బిడ్డలకు దూరమైన సరబ్జీత్ అనే ఓ సామాన్య రైతు... అత్యంత హృదయ విదారక పరిస్థితుల్లో చనిపోవడం... ఆయన కుటుంబంలోనే గాక దేశ ప్రజలందరిలోనూ విషాదం నింపింది.


Click it and Unblock the Notifications












