ఎస్పీ బాలుకు మరో పురస్కారం
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు,గాన గాంధర్వుడు బిరుదాంకితుడు అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం కు మరో పురస్కారం లభించింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా రసమయి సంస్థ గత పదమూడేళ్లుగా ఓ పురస్కారాన్ని అందజేస్తోంది. ఈయేడాది ఆ గౌరవం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు దక్కింది.
సాలూరి రాజేశ్వరరావు 93వ జయంతి సందర్భంగా ఈనెల 25న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని బాలుకు అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, డా||సి.నారాయణరెడ్డి, కె.ఐ.వరప్రసాద్రెడ్డి, సాలూరి కోటి, వాసూరావు తదితరులు పాల్గొంటారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ...‘‘నా పదిహేనో ఏట... నేను ఓ ఆర్కెస్ట్రాలో పాడుతుంటే.. ఆ కార్యక్రమానికి సాలూరివారు అతిథిగా వచ్చారు. అప్పుడు నేను ఆయన ఆటోగ్రాఫ్ అడిగితే- నా పూర్తిపేరు, భవిష్యత్తులో గాయకునిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధించాలని సంతకం చేశారు. సాలూరివారి కంపోజిషన్ చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో గాయకులు ఆయన కంపోజిషన్లో పాడటానికి భయపడిపోయేవారు.'' అని అన్నారు.
పాడుతా తీయగా కార్యక్రమంతో పాటు ఇతర అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం . వయస్సు మీద పడుతున్నా గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, టీవీ కార్యక్రమాల ద్వారా ప్రఖ్యాతి గాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ చురుకుగా సంగీత సాగరంలో ముగిని తేలుతున్నారు.


Click it and Unblock the Notifications











