గోడ దూకుతూ పట్టుబడిపోయా: సమంత
హైదరాబాద్ :క్లాసు ఎగ్గొట్టి సినిమాకెళ్లాలంటే సరదా. దీనికోసం చాలా సార్లు కాలేజీ గోడ దూకా. ఓ రోజు అలా గోడ దూకుతూ పట్టుబడిపోయా. నా ఫ్రెండ్స్పై చాడీలు చెప్పేసి తప్పించుకున్నా అంటోంది సమంత. తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమంత...తన గతాన్ని తలుచుకున్నారు.
అలాగే... నేను చదివింది చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీ. తెరమీద నేనెంత అమాయకంగా కనిపిస్తానో కాలేజీలో లెక్చరర్లకూ అంతే అమాయకంగా కనిపించేదాన్ని... కాదు నటించేదాన్ని. పాపం వాళ్లు నా అంత మంచి విద్యార్థిని లేదనుకునేవారు. వాళ్లు అలా వెళ్లారా క్లాసులో అల్లరే అల్లరి. లెక్చరర్లూ క్లాస్మేట్స్ మీద జోకులూ సెటైర్లూ వేసి, పుకార్లు సృష్టించి ఏడిపించేదాన్ని అన్నారామె.
సమంతకు వరసగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రెస్ట్ తీసుకుంటానన్నా ఆగటం లేదు. తెలుగు,తమిళ స్టార్ హీరోలు,దర్శకులు,నిర్మాతలు ఆమెను లక్కీ గా భావించి తమ చిత్రంలో తీసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఆమె ప్రముఖ దర్శకుడు మురగదాస్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే సూర్య చిత్రం కోసం ఆమె ఈ రోజు రాత్రి ముంబై వెళ్తోంది. అక్కడ రాజు సుందరం దర్శకత్వంలో మూడు రోజులు పాటు పాట షూటింగ్ లో పాల్గొననుంది.
పుట్టి పెరిగింది చెన్నైలోనే అయినా.. సమంతకు హీరోయిన్ గా గుర్తింపునిచ్చింది మాత్రం టాలీవుడే. ఎన్టీఆర్, మహేష్, పవన్ వంటి అగ్ర హీరోలతో జతకట్టి టాలీవుడ్ టాక్ ఆఫ్ది హీరోయిన్గా నిలిచిన ఈ అమ్మడు.. ప్రస్తుతం కోలీవుడ్ క్వీన్గా మారనుంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది సమంత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉండగా మరో పెద్ద హీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం సమంత పలు చిత్రాల షూటింగులతో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమంత నటించిన మరో చిత్రం 'ఆటో నగర్ సూర్య' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం', సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న టైటిల్ ఖరారు కాని సినిమాతో పాటు, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక తెలుగులో సినిమాలో నటిస్తోంది. వీటి తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో సమంత నటించనుంది.


Click it and Unblock the Notifications












