సినిమాల నుంచి వెళ్లిపోయేలోపు ఇలాంటి సినిమా చేయాలనే కోరిక తీరింది: సమంత
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న కామెడీ మూవీ 'ఓ బేబీ'. నందీనీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గురువారం మీడియాతో సమావేశమైంది. ఈ సందర్భంగా సమంత భావోద్వేగంగా మాట్లాడారు. సినిమాల నుంచి వెళ్లిపోయేలోపు పూర్తిస్థాయి కామెడీ మూవీ చేయాలన్న కోరిక 'ఓ బేబీ'తో తీరిపోయిందని సమంత వ్యాఖ్యానించారు. 'ఓ బేబీ' మూవీలో కామెడీతో పాటు ఎమోషన్స్ ఉంటాయి.
2019 తనకు లక్కీ ఇయర్ అని... తమిళంలో సూపర్ డీలక్స్, తెలుగులో మజిలీతో మంచి విజయం అందుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. చేస్తే మంచి సినిమాలు మాత్రమే చేయాలి, లేక పోతే లేదు అనే నిర్ణయం తీసుకున్నపుడు రంగస్థలం, మహానటి, సూపర్డీలక్స్, మజిలీ లాంటి కథలు నా వద్దకు వచ్చాయని సమంత తెలిపారు.

నటిని కావాలనే నా డ్రీమ్ నేను నిజం చేసుకున్నాను. కానీ మన అమ్మ, బామ్మ లాంటి వారికి వారి కలను నిజం చేసుకునే అవకాశం రాలేదు. మనల్ని చూసుకోవడానికే వారికి సమయం సరిపోయింది. ఈ విషయం కూడా మనం వారిని అడిగి ఉండం. 'ఓ బేబీ' మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విషయం గురించి వారిని అడుగుతారు, వారు వారి కలలను పక్కన పెట్టిన మన కోసం సమయం కేటాయించారనే భావన మీలో కలుగుతుంది అని సమంత తెలిపారు.
ఈ చిత్రంలో రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి కీలక పాత్రల్లో నటించారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్సాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











