రామ్ గోపాల్ వర్మపై సెటైర్ వేసిన హీరో సంపూర్నేష్ బాబు
హైదరాబాద్: ‘వంగవీటి' తెలుగులో నా చివరి సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్మ ఇలాంటి ప్రకటనలు చేయడం కొత్తేమీ కాదు.... గతంలో ఆయన దర్శకత్వం వహించిన ‘గోవింద' చిత్రానికి సెన్సార్ కట్స్ ఎక్కువగా చేసారంటూ కోపగించుకున్న వర్మ ఇకపై తెలుగులో సినిమాలు తీయనని ప్రకటించి, ముంబై వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత హిందీలో 'రంగీలా', 'సత్య', 'కంపెనీ', 'సర్కార్' వంటి సంచలనాత్మక సినిమాలు తీసి, విజయం సాధించారు. తరువాత తన నిర్ణయం మార్చుకుని 'అనగనగా ఒకరోజు' నుంచి వరుసగా సినిమాలు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు కామెడీ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆయనపై సెటైర్ వేస్తూ ట్వీట్ చేసారు.
‘వంగవీటి' సినిమా గురించి వర్మ చేసిన తాజా ప్రకటన ఇలా ఉంది...
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా , నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో... ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు,చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే. నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న "వంగవీటికి" ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా.
పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్,శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ,ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషైనా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు ... రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు.
ఫాక్షనిజం కి బ్యాక్ గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీయిజానికి వారసత్వం దమ్ము. ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మునోడిని పైకి పంపటమే అసలు సిసలైన నిజమైన రౌడీయిజం. అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు,బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. "వంగవీటి" చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది..

"శివ" తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం "వంగవీటి" కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. వంగవీటి రాధాగారు,చలసాని వెంకటరత్నంగారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే "వంగవీటి" చిత్రం.
కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటాడోర్ వాన్లు వుండి,సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ళ క్రితంనాటి ఆ నాటివిజయవాడ వాతావరణాన్ని పునసృష్టించటానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దని "వంగవీటి" నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, విజయవాడ గత చరిత్రని ఇప్పటికి, ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యటానికి మా"వంగవీటి" యూనిట్ శరవేగంతో సిద్ధమవుతోంది.
వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రదారులు వంగవీటి రాధా, వంగవీటి మోహన రంగా, వంగవీటి రత్నకూమారి, దేవినేని నెహ్రు, దేవినేని గాంధీ, దేవినేని మురళి, కర్నాటి రామమోహనరావు, సిరిస్ రాజు, రాజీవ్ గాంధీ, దాసరి నారాయణ రావు, ముద్రగడ పద్మనాభం, నందమూరి తారక రామారావు, రామ్ గోపాల్ వర్మ తదితరులు అని వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











