ప్రాణాలకు ముప్పుందని సంజయ్ దత్ వెల్లడి
ముంబయి పేలుళ్ల కేసులో జైలు శిక్ష పడిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పుణేలోని ఎరవాడ జైలులో లొంగిపోయేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఈ మేరకు తనకు అనుమతివ్వాలని కోరుతూ మంగళవారం ఆయన ముంబయిలోని టాడా కోర్టుకు అభ్యర్థన దాఖలు చేశారు.
పిటిషన్ను పరిశీలించిన జడ్జి జీఏ సనప్ సీబీఐ ప్రతిస్పందనను కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. సంజయ్దత్ ఈ దరఖాస్తు చేయటానికి కొన్ని గంటల ముందే ఆయన లొంగిపోవటానికి గడువు పొడిగించాలన్న ఓ సినీ నిర్మాత అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
సంజయ్ నటిస్తున్న రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని పూర్తి చేసేందుకు మరికొంత సమయంపడుతుందని, అప్పటి వరకూ లొంగుబాటు గడువును పొడిగించాలని నిర్మాత తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను విచారణకు చేపట్టేందుకు జస్టిస్ బీఎస్ చౌహాన్, దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం తిరస్కరించింది. దీంతో సంజయ్దత్ ఇదివరకే కోర్టు నిర్దేశించిన విధంగా ఈనెల 16న లొంగిపోవాల్సి ఉంటుంది.
1993 ముంబయి పేలుళ్ల కేసులో ఇప్పటికే ఏడాదిన్నర శిక్ష అనుభవించిన సంజయ్...మరో మూడున్నరేళ్ల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి ఉంది. సంజయ్దత్ లొంగుబాటుకు నాలుగువారాల సమయమిస్తూ కోర్టు ఏప్రిల్ 16న ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. దీనిని మరోసారి పొడిగించటానికి ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు.


Click it and Unblock the Notifications












