సంజయ్కి క్షమాబిక్షపై చిరంజీవి స్పందన
న్యూఢిల్లీ : 1993 ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ షాకయింది. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ సంజయ్కి మద్దతు ప్రకటించారు. ఆయనకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు, అతను ఎంతో మంచి వాడు, అతనికి క్షమాబిక్ష దొరకాలి అని ఆకాక్షించారు.
మెగాస్టార్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన చిరంజీవి సంజయ్ విషయమై మీడియాతో మాట్లాడుతూ...'సంజయ్ ఇప్పటికే ఆ కేసు మూలంగా చాలా సఫర్ అయ్యాడు. అతనికి క్షమాబిక్ష దొరకాలని కోరుకుంటున్నాను. అతను ఎంతో మంచి వ్యక్తి. అతనికి మంచి జరుగాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.
అయితే సంజయ్ దత్ మాత్రం...తాను క్షమాభిక్ష పిటిషన్ను వేయడం లేదని చెప్పారు. సుప్రీం కోర్టులో తాను లొంగిపోతానని చెప్పారు. కోర్టులపై తనకు పూర్తిగా నమ్మకముందని చెప్పారు వెల్లడించారు. మరో వైపు ఆయన శిక్ష అనుభవించి తీరాలని అని కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
సంజయ్ దత్కు క్షమాభిక్ష పెడితే తాను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తానని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన విషయం తెలిసిందే. సంజయ్ దత్కు క్షమాభిక్ష పెట్టవద్దని, అదే జరిగితే తాను కోర్టులో సవాల్ చేస్తానని ఆయన అన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆయన శిక్ష అనుభవించాలన్నారు. మరోవైపు బిజెపి వంటి ప్రధాన ప్రతిపక్షం కూడా సంజయ్ దత్కి క్షమాభిక్షను వ్యతిరేకిస్తోంది.
కేసు వివరాల్లోకి వెళితే.. 1993 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్కి సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఇప్పటికే పద్దెనిమిది నెలల జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్న సంజయ్ని నాలుగు వారాల్లో కోర్టులో లొంగి పోవాల్సిందిగా కోర్టు గురువారం ఆదేశించింది. దీంతో ఆయన మిగిలిన మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడింది.


Click it and Unblock the Notifications











