మళ్లీ జైలు గూటికి సంజయ్, గేటు వరకు వచ్చిన భార్య
ఈ సారి దీపావళి పండగను సంజయ్ దత్ జైల్లో తన సహచర ఖైదీలతో కలిసి జరుకోనున్నాడు. కాగా...సంజయ్ దత్ పెరోల్ పై బయటకు వచ్చిన తర్వాత అనేక రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అతనికి క్షమాబిక్ష లభించే అవకాశం ఉందని, అదే జరిగితే జైలు జీవితం తప్పే అవకాశం ఉందనే ప్రచారం సాగింది.
అయితే ఈ రూమర్లకు మహారాష్ట్ర హోం మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ గత శుక్రవారం తెరదించారు. సెంట్రల్ గవర్నమెంటు నుంచి క్షమాబిక్షకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేసారు. సంజయ్ దత్ ఫ్యామిలీ కూడా క్షమాబిక్ష గురించి ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేసారు.
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.


Click it and Unblock the Notifications












