వెళ్లకుంటే?: ఎంఎస్ మరణంపై బాలయ్య, మోహన్ బాబు
హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మరనం సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు భీమవరం వెళ్లిన ఆయన మలేరియా సోకి అనారోగ్యం బారిన పడ్డారు. ఆ అనారోగ్యమే ఆయన్ను మరణ శయ్య వైపు నడిపించిందని సన్నిహితులు అంటున్నారు. ఒక వేళ ఆయన అక్కడికి వెళ్లి ఉండక పోతే ఆ మాయదారి రోగం ఆయన్ను దరిచేది కాదు, అనారోగ్య సమస్య ఆయన్ను కబలించేది కాదనేది ఆయన సన్నిహితులు అభిప్రాయ పడుతున్నారు.
కాగా....ఎంఎస్ మరణంపై నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన్ను అద్భుతమైన నటుడిగా పేర్కొన్నారు. ఆయన నాకు మంచి మిత్రుడు. పలు సినిమాల్లో కలిసి చేసాం. ఆయన మృతి చెందారన్న వార్త మనసును కలిచి వేసింది. ఈ మధ్య కూడా ‘లయన్'లో కలిసి నటించాం. అలాంటి గొప్ప నటుడిని పరిశ్రమ కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అన్నారు.

ఎంఎస్ మరణంపై మోహన్ బాబు స్పందిస్తూ...మా సినిమా ‘ఎం.ధర్మరాజు ఎంఏ'తో నటుడిగా పరిశ్రమకు పరిచయమయ్యాడు. నాతోనూ, నా బిడ్డలతోనూ నటించడానికి ఎంతో ఆసక్తి చూపించేవారు. ఏ రోజూ నాకు ఇంత పారితోషికం కావాలని నోరు తెరిచి అడగలేదు. ఎప్పుడైనా నేను ఫోన్ చేయకపోతే ‘ఎందుకు బాబుగారూ నన్ను మర్చి పోయారు?' అని అడిగేవారు. ఎంత బిజీగా ఉన్నా మా సంస్థలో సినిమాలు చేయాలని కోరుకునే వారు. అంటే అతనికి అవకాశాలు లేక కాదు. మాతో సినిమాలు చేయాలనే ఆపేక్షతో. ‘పెదరాయుడు'లో ఎమ్మెస్ నటన చూసి చాలా గొప్ప స్థాయికి ఎదుగుతాడని అనుకున్నా. అలాగే చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వ్యక్తిగతమైన విషయాలను కూడా నాతో చెప్పుకునేవారు. మీరే సమస్య తీర్చాలని వచ్చే వారు. తను మంచి నటుడు, రచయిత, కవి, దర్శకుడు. తన మరణం పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను అన్నారు.
అల్లరి నరేష్ స్పందిస్తూ...మా నాన్నగారు ఈవీవీ సత్యనారాయణగారంటే ఎమ్మెస్ నారాయణగారికి చాలా గౌరవం. తన జీవితాన్ని టర్న్ చేసిన ఘనత నాన్నగారిదేనని ఎప్పుడూ చెబుతుండేవారు. మా ఈవీవీ సంస్థ నిర్మించిన పలు సినిమాల్లోనూ, నేను నటించిన చిత్రాల్లోనూ చేసారు. మంచి కామెడీ డైమింగ్ ఉన్న నటుడు. డైలాగులు చెప్పే విధానంలో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న వ్యక్తి. అతి తక్కువ కాలంలోనే 700లకు పైగా సినిమాలు చేసిన కృషీవలుడు. తనదైన పాత్రలతో ప్రజలను నవ్వించిన ఆయన ఇకలేరనే వార్త తెలిసి బాధ కలిగింది. ఆయన లేని లోటు తీరనిది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











