మెగాస్టార్ చిరంజీవితో సినిమా కోసం పర్చూరి సోదరులు స్క్రిప్టును సిద్ధం చేశారు. చిరంజీవి సినిమా నిర్మాణం మార్చిలో ప్రారంభమవుతుందని పరచూరి గోపాలకృష్ణ చెప్పారు. మెగాస్టార్ ఇమేజ్ ను మరింత పెంచే స్ర్కిప్టును తాము సిద్ధం చేస్తున్నామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. చిరంజీవి కోసం తాము ఐదు కథలు సిద్ధం చేశామని, వీటిలోంచి ఒకదాన్ని ఎంపిక చేసుకుంటామని ఆయన అన్నారు. ఈ సినిమాలో రాజకీయపరమైన సంభాషణలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రస్తుత స్థితిలో చిరంజీవి నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశిస్తున్నదేమిటో దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రిప్టును రాస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్శకుడి ఎంపిక ఇంకా జరగలేదని ఆయన చెప్పారు. అల్లు అరవింద్, కె. రాఘవేంద్రరావు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారని ఆయన చెప్పారు.