నేను నారాయణమూర్తి ఫ్యాన్ని : శేఖర్కమ్ముల

అలాగే ''నిర్భయ ఘటనపై తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమెదట స్పందించిన వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. ఆ ఘటన గురించి, ఇలాంటి వాటిని నివారించే చర్యల గురించి ఈ సినిమాలో ఆయన చక్కటి పరిష్కారాన్ని సూచించారు. నిర్భయ ఘటన తర్వాత దేశంలో యువతరం ఉవ్వెత్తున ఉద్యమంలా ఎగిసింది. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ విషయాలన్నింటినీ చూడొచ్చు''అన్నారు శేఖర్ కమ్ముల. ఆర్.నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'నిర్భయ భారతం'. శేఖర్ కమ్ముల తొలి సీడీని ఆవిష్కరించి వందేమాతరం శ్రీనివాస్కి అందజేశారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ "మనకు స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దం దాటింది. అయినా భయం నీడనే బతుకుతున్నాం. ఇప్పటికీ ఆడది అర్థరాత్రి నిర్భయంగా నడవలేకపోతోంది. అలా నడిచిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం. ఈ విషయాన్నే చెప్తూ ఈ సినిమాను తెరకెక్కించాను. తప్పు చేసిన వాళ్లకి వెంటనే శిక్ష అమలు కావాలనే ఉద్దేశంతో తెరకెక్కించాను. సెన్సార్ కూడా పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాను. కళాకారులు ఎంతో అభిమానంతో ఈ సినిమాకు పనిచేశారు. జొన్నవిత్తుల రాసిన పాటకు తప్పకుండా అవార్డు వస్తుందని అందరూ అంటున్నారు. నా సినిమాకు పనిచేసిన చాలా మందికి అవార్డులు వచ్చాయి. కానీ నాకు మాత్రం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ఇవ్వలేదు'' అని అన్నారు.
దర్శకురాలు జయ మాట్లాడుతూ ''అంకితభావం ఉన్న వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. ఎప్పుడూ.. ఎక్కడా తలదించుకొనే సినిమాలు తీయలేదు. ఇప్పుడూ ఈ సినిమాని అదే స్థాయిలో తెరకెక్కించార''అన్నారు. ఇక ''స్త్రీ అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లని గాంధీజీ అన్నారు. ప్రస్తుతం చూస్తే పట్టపగలు తిరగడానికే మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. వారిపై జరుగుతున్న దాడులకు సరైన సమయంలో న్యాయం జరగక.. నిందితులకు వెంటనే శిక్షపడక ఇలా జరుగుతోంది. తప్పు చేసిన వాళ్లకి వెంటనే శిక్ష విధించాలనే విషయాన్ని సినిమా ద్వారా చూపించబోతున్నారు ''అన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వరంగల్ శ్రీనివాస్, దయా నర్సింగ్, ధర్మవరపు వెంకటరమణ, సాయిచంద్, జలదంకి సుధాకర్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











