సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత .. చిరంజీవికి గాత్రదానం, ఆల్రౌండర్గా జేజేలు
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన 80 సంవత్సరాలు. గణేశ్ మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఢిల్లీ గణేశ్ ప్రస్థానం :
1944 ఆగస్ట్ 1న తమిళనాడులోని తిరునల్వేలి గణేశ్ జన్మించారు. ఆయన పూర్తి పేరు గణేశన్. సినిమాల్లోకి రాకముందు ఆయన ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన దక్షిణ భారత నాటక సభ అనే థియేటర్ ట్రూప్లో పనిచేయడంతో ఆయన పేరు ఢిల్లీ గణేష్గా మారింది. దిగ్గజ దర్శకుడు కే బాలచందర్ ఆయనకు ఢిల్లీ గణేష్ అని నామకరణం చేశారు. అంతేకాదు.. గణేష్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగి కూడా. 1964 నుంచి 1974 వరకు వాయుసేనలో పనిచేసి దేశానికి సేవలందించారు.

అనంతర కాలంలో సినీ రంగ ప్రవేశం చేశారు ఢిల్లీ గణేష్. కే బాలచందర్ 1976లో తెరకెక్కించిన పట్టిన ప్రవేశం చిత్రం ద్వారా ఆయన వెండితెరపై అడుగుపెట్టారు. 1981లో ఎంగమ్మ మహారాణి మూవీతో హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ సహాయ నటుడిగా, కమెడియన్గానే ఆయనకు ఎక్కువ పేరు ప్రతిష్టలు రావడంతో హీరోగా చాలా తక్కువ సినిమాల్లోనే నటించారు. అంతేకాదు అపూర్వ సగోదరంగల్ (1989)లో విలన్గానూ భయపెట్టారు గణేష్.
దాదాపు ఐదు దశాబ్ధాల కెరీర్లో 400కు పైగా సినిమాల్లో నటించారు ఢిల్లీ గణేష్. సింధు భైరవి, నాయకన్, మైఖేల్ మదన కామరాజు, ఆహా, తెనాలి వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో 1991లో జైత్రయాత్ర, 2006లో నాయుడమ్మ, 2009లో పున్నమి నాగు సినిమాలో గణేష్ నటించారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఢిల్లీ గణేష్కు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. 1979లో వచ్చిన పాసిలో నటనకు గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రత్యేక బహుమతిని పొందారు. 1994లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా కలైమామణి అవార్డును అందుకున్నారు.
సినిమాలే కాదు ఎన్నో సీరియల్స్లో నటించారు ఢిల్లీ గణేష్ . 1990 నుంచి నేటి వరకు దక్షిణాదిలోని అన్ని భాషల్లో సీరియల్స్ చేశారు గణేష్. ధారావాహికల ద్వారా ఆయన ఇంటిల్లిపాదికి బాగా దగ్గరయ్యారు. తండ్రి, తాత, మావయ్య ఇతర సపోర్టింగ్ రోల్స్లో ఆయన ఒదిగిపోయారు. సీరియల్సే కాదు.. షార్ట్ ఫిలింస్లోనూ నటించి షాకిచ్చారు గణేష్. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ ఆయన అందరికీ సుపరిచితుడు .
అగ్ర హీరోలు విష్ణువర్ధన్, చిరంజీవి, ప్రతాప్ పోతన్ వంటి వారికి తమిళంలో గాత్రదానం చేశారు. తెలుగు ఆల్టైమ్ క్లాసిక్ జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా తమిళ్లో కాదల్ దేవతైగా డబ్బింగ్ కాగా.. తమిళ్ వెర్షన్లో చిరంజీవి పాత్రకు గణేష్ డబ్బింగ్ చెప్పారు. అలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న గణేష్ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications











